ఏపీ పరిషత్ ఎన్నికలపై చేతులెత్తేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

By narsimha lodeFirst Published Mar 24, 2021, 12:38 PM IST
Highlights

ఏపీ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేమని  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 


అమరావతి:ఏపీ రాష్ట్రంలో జిల్లా పరిషత్ ఎన్నికలకు షెడ్యూల్ ఇవ్వలేమని  రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 

బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.ఈ నెల 31వ తేదీతో తన పదవీ కాలం పూర్తవుతుండటంతో బాధ్యతలను వేరే వారు నిర్వహిస్తారని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయలేనని వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఏకగ్రీవాలు జరిగిన చోట ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.

 దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. రిటర్నింగ్ అధికారులు దీనిపై విచారణ చేస్తారని చెప్పారు. హైకోర్ట్ తీర్పునకు అనుగుణంగా ఈ ఆదేశాలిస్తున్నామని నిమ్మగడ్డ పేర్కొన్నారు.

 గ్రామ పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం ఎంతో శ్రమకోర్చి పనిచేశారన్నారు. భారత ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తోందని... పోలింగ్ సిబ్బందికి వ్యాక్సినేషన్‌ను నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని తెలిపారు. 

రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం అవలంభించిన మంచి పద్ధతులను అమలు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూడా పోలింగ్ సిబ్బందికి వెంటనే వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.

 సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించిన అనంతరమే పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.
 

also read:హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలియాలి: హైకోర్టుకు సమాధానిమిస్తానన్న బొత్స

also read:గవర్నర్‌కు ఏపీ ఎస్ఈసీ రాసిన లేఖలు లీక్: బొత్స, పెద్దిరెడ్డిలకు ఏపీ హైకోర్టు నోటీసులు


 

click me!