విశాఖ జిల్లాలో రింగ్ వలల వివాదం: మత్స్యకార గ్రామాల మధ్య టెన్షన్

By narsimha lodeFirst Published Jul 29, 2022, 9:54 AM IST
Highlights

విశాఖపట్టణం జిల్లాలో మరోసారి రింగ్ వలల వివాదం తెరమీదికి వచ్చింది. ఈ వివాదం రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. పెదజాలరిపేట, జాలరి ఎండాడ గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకొంది. ఈ విషయమై  ఉద్రిక్తత చోటు చేసుకొంది.  

విశాఖపట్టణం: Visakhapatnam జిల్లాలో మరోసారి Ring Net వివాదం తెర మీదికి వచ్చింది. గతంలో రింగ్ వలల వివాదం కారణంగా Fishermen బోట్లను దగ్దం చేసిన ఘటనలు జిల్లాలో చోటు చేసుకొన్నాయి. దీంతో మరోసారి రింగ్ వలల వివాదం తెరమీదికి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  విశాఖ జిల్లాలోని పెదజాలరిపేటతో పాటు పలు మత్స్యకార గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకొంది.

చేపల వేటకు రింగ్ వలలను ఉపయోగించడంతో సంప్రదాయంగా చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులు అభ్యంతరం చెబుతున్నారు. రింగ్ వలలు కనీసం సుమారు కిలోమీటర్ పరిధిలో ఉంటాయి.  దీంతో చిన్న చేప పిల్లలతో పాటు పెద్ద చేపలు కూడా రింగ్ వలలకు వస్తాయి. 

Also read:ఒడిశాలో చిక్కుకున్న మత్స్యకారులు: గంజాం పోర్టులోకి అనుమతివ్వాలంటున్న విశాఖవాసులు

అయితే రింగ్ వలలను ఉపయోగించడం వల్ల చేపలు నాశనమౌతాయని సంప్రదాయ పద్దతిలో చేపల వేటను సాగించే మత్స్యకారులు చెబుతున్నారు. రింగ్ వలలతో చేపల వేట చేసే బోట్లను సంప్రదాయంగా చేపల వేట చేసే మత్స్యకారులు దగ్దం చేశారనే ప్రచారం సాగడంతో  మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది.  

దీంతో రింగ్ వలలతో వేట సాగించే మత్స్యకారులు సంప్రదాయంగా చేపల వేట సాగించే మత్స్యకారులకు చెందిన నాలుగు బోట్లను తీసుకొచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకొంది. ఈ విషయం తెలిసిన తర్వాత పోలీసులు గ్రామంలోకి చేరుకొని ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు వర్గాలకు చెందిన మత్స్యకారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. 

 మత్స్యశాఖ జేడీతో పాటు పోలీసు శాఖాధికారులు  గ్రామంలోని మత్స్యకారులతో చర్చించారు. అన్ని బోట్లకు GPS సిస్టమ్ తో మానిటరింగ్ చేయీల్సిన అవసరం ఉందని మత్స్యకారులు చెబుతున్నారు. మత్య్సశాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మత్య్సకారులు ఆరోపిస్తున్నారు. 

రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో సుమారు 200 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇరు వర్గాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చేస్తున్నామని పోలీసులు చెప్పారు.ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు చేపల వేటకు వెళ్లకుండా చూస్తామన్నారు. కలెక్టర్ కూడా ఈ విషయమై ఇరు వర్గాలతో మాట్లాడే అవకాశం ఉందన్నారు.

Jalari Yendada గ్రామానికి చెందిన మత్స్యకారుల బోట్లను Pedajalaripetaమత్స్యకారులు దగ్దం చేశారని  జాలరి ఎండాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారని పోలీసులు చెప్పారు. పెదజాలరిపేటకు చెందిన మూడు బోట్లను మత్య్సకారులు తీసుకొచ్చారని పోలీసులు వివరించారు. 

దీంతో రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఇరు వర్గాలు పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నాయి.  ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నామని Police తెలిపారు. అయితే రెండు గ్రామాల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ రెండు గ్రామాల్లో 144 సెక్షన్ ను విధించారు.  అంతేకాదు తాత్కాలికంగా చేపల వేటను కూడా నిషేధించారు.

గతంలో కూడా ఇదే తరహలో  విశాఖ జిల్లాలో రింగ్ వలల మత్స్యకారులకు, సంప్రదాయ పద్దతుల్లో చేపల వేట చేసే మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ సమయంలో జిల్లా యంత్రాగం చొరవ తీసుకొని మత్స్యకారుల మధ్య రాజీ చేసిన విషయం  తెలిసిందే.

click me!