ముద్రగడ పద్మనాభానికి టీడీపీ నేత బుద్దా వెంకన్న లేఖ రాశారు. అనవసరంగా చంద్రబాబును ప్రతి విషయంలోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ఆయనకు కులాన్ని ఆపాదించవొద్దని కోరారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో లేఖల రాజకీయం ఊపందుకున్నది. కాపులు కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిపై ఒకరు వాడిగా వాగ్బాణాలు వదులుతున్నారు. పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పద్మనాభం లేఖాస్త్రం సంధించి కుల రాజకీయాలు చేయొద్దని అన్నారు. ఆయన రాసిన లేఖల్లో చంద్రబాబునూ ప్రస్తావించారు. దీంతో తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ లీడర్ బుద్దా వెంకన్న లేఖ రాశారు. ముద్రగడపై అందులో బుద్దా వెంకన్న సీరియస్ అయ్యారు.
ముద్రగడ పద్మనాభంది పొరబాటా? లేక గ్రహపాటా? అంటూ ఆగ్రహించారు. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యారని, అలాంటప్పుడు ఆయనను 1993-94లలో ముద్రగడ ఎలా కలుస్తారని నిలదీశారు. అసలు ఈ లేఖలు ముద్రగడ రాసిందా? లేక జగన్ మోహన్ రెడ్డి రాసి ఇచ్చిందా? అంటూ ప్రశ్నించారు.
1993-94లలో పత్తిపాడు ఎమ్మెల్యేగా ముద్రగడ ఉన్నప్పుడు సీఎంగా కోట్ల విజయభాస్కర రెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. ముద్రగడ చెబుతున్న కేసులు.. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నమోదైనవని పేర్కొన్నారు. ఈ విషయం మరిచిపోయారా? అసలు జరగనే జరగని విషయాలను ఎందుకు జరిగినట్టు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు.
Also Read: సీఎం జగన్ ఇలాకా.. కడపలో పట్టపగలే నడినడిరోడ్డుపై వైసీపీ కార్యకర్త దారుణ హత్య
ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడును ఎందుకు లాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. రాజకీయంగా ఏదైనా మాట్లాడితే తమకు అభ్యంతరం లేదని వివరించారు. కానీ, చంద్రబాబు నాయుడుకు కులాన్ని ఆపాదించవొద్దని కోరారు. చంద్రబాబు అన్ని కులాలను సమానంగా చూస్తారని, చూశారనీ తెలిపారు. సంక్షేమ పథకాలనూ అమలు చేశారని పేర్కొన్నారు.