
నిన్న ఏర్పేడు దగ్గిర ఘోర ప్రమాదంలో మరణించిన పేద రైతుల కుటుంబాల పరామర్శకు వెళ్ళిన మంత్రి నారా లోకేష్, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
మీ కారణం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇంతజరగుతున్నా మీ ప్రభుత్వం పట్టించుకోనందునే వూరి మగవారు రోడ్డెక్కి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పొగొట్టుకున్నారని ఒక బాధితుడి భార్య రోధిస్తూ మాజీ మంత్రి బొజ్జలకు చెప్పింది.
’నువ్వు పదవి పోయనప్పుడే అంత బాధ పడ్డావే. నాకుటుంబ నాశనమయింది. దీనికి ఏమిచెబుతావు,’అని నిలదీసింది.
ఇంత జరగుతూ ఉంటే మీకు తెలియదా... ఏరు ను కాపాడుకునేందుకు రాత్రంతా కాపలాకాసేవాళ్లం అని రోధించింది.
ఏర్పేడు మండలంలోని మునగాలపాళెం గ్రామానికి చెందిన 16 మంది శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో మరణించారు. లోకేశ్ ను, బొజ్జలను చూడగానే మృతుల బంధువులు ఒక్కసారిగా మండిపడ్డారు. మీ వల్లే మావాళ్ళు చనిపోయారంటూ శాపనార్ధాలు పెట్టారు. మీ వెనుకున్న వాళ్లు మావాళ్ళను చంపేసారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు.
రూ. 10 లక్షలు ఇస్తాను నా భర్తను తెచ్చిస్తారా అంటూ మృతిచెందిన వ్యక్తి భార్య లోకేష్, బొజ్జలను గట్టిగా నిలదీసింది. స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారంటూ ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదంటూ ఆగ్రహించారు. శ్రీకాళహస్తికి రోడ్డు నిర్మాణం కూడా సరిగా లేదని మండిపడ్డారు.
బొజ్జల అనుచరుల వల్లే తమ ఊరు వల్లకాడుగా మారిందంటూ మండిపడ్డారు. అమరావతికి రోడ్లు వేయటం కాదు తమ ఊర్లకు కూడా రోడ్లు వేయాలంటూ డిమాండ్ చేసారు. అసలు మంత్రులను ఎవ్వరినీ జనాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దాంతో వీరి ధాటికి, ఆగ్రహానికి తట్టుకోలేక లోకేష్, బొజ్జలతో పాటు మంత్రులు నారాయణ, అమరనాధ రెడ్డిలు చివరకు వెనుదిరిగారు.
అక్కడ ఉన్న చాలమంది ఇసుక తోలుకుపోతున్నది మీ సమీప బంధువులేనని కూడా లోకేశ్ కు, బొజ్జలకు వివరించారు.
అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడుతూ, ఇసుక తవ్వకాల వెనుక ప్రజలు అనుకుంటున్నట్లు మాఫియా ఏమీ లేదన్నారు. అనుమతి లేకుండా కొందరు గ్రామస్తులు ఇసుక తరలిస్తున్నారన్న ఫిర్యాదులపై కలెక్టర్ విచారణ చేస్తున్నట్లు చెప్పారు. మృతులంతా టిడిపి వారేనంటూ చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల నష్టపరిహారం అందచేస్తామని హామీ ఇచ్చారు.