నారా లోకేశ్ రేపు తన పాదయాత్రను పున:ప్రారంభించనున్నారు. రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం తన ‘యువగళం’ కొనసాగిస్తారు. ఆయనకు మద్దతుగా రేపు 175 నియోజకవర్గాల బాధ్యులు పాల్గొంటారు.
హైదరాబాద్: ఈ ఏడాది జనవరిలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. 209 రోజులు ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. ఈ కాలంలో సుమారు 2852 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఇంతలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తనయుడు లోకేశ్ తన పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు.
ఇప్పుడు చంద్రబాబు బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో నారా లోకేశ్ తన పాదయాత్రను పున:ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచే ఈ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఎక్కడైతే ఈ పాదయాత్ర ఆగిందో.. అక్కడి నుంచే పున:ప్రారంభం అవుతున్నది. ఇందుకోసం టీడీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి ఉదయం 10.19 గంటలకు లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలవుతుంది. ఆయనకు మద్దతుగా 175 నియోజకవర్గాల ఇంచార్జీలు రేపు ఈ పాదయాత్రలో పాల్గొనబోతున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. రేపు సుమారుగా 20 కిలోమీటర్లు నారా లోకేశ్ పాదయాత్ర సాగనున్నట్టు తెలుస్తున్నది.
Also Read: Barrelakka: కొల్లాపూర్లో బర్రెలక్క పోటీతో ఎవరికి నష్టం? ఎవరికి మేలు?
తాటిపాక సెంటర్లో రేపు బహిరంగ సభ నిర్వహిస్తారని, ఆ తర్వాత పి గన్నవరం నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఇక్కడ గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేశ్ మాట్లాడతారు. ఆ తర్వాత అమలాపురం నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. రాత్రి పేరూరు శివారు విడిది కేంద్రంలో బస చేస్తారు.