మంత్రివర్గంలో నంద్యాల ఉపఎన్నిక కలవరం స్పష్టంగా కనబడుతోంది. గురువారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. చంద్రబాబునాయుడు అద్యక్షతన రెండు గంటల పాటు జరిగన సమావేశంలో చర్చ ప్రధానంగా ఉపఎన్నికపైనే జరిగింది. అంటే, ప్రభుత్వంలో నంద్యాల ఉపఎన్నిక ఏస్ధాయిలో కలవర పెడుతోందో అర్ధమైపోతోంది. అందులోనూ ప్రదానంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కదలికలపైనే నిరంతర నిఘా వుంచాలని కూడా సమావేశంలో నిర్ణయించారట.
ఉపఎన్నికలో గెలవటానికి టిడిపి పడుతున్న అవస్తలు అందరూ చూస్తున్నదే. మొత్తం మంత్రివర్గాన్నే నంద్యాలలో మోహరించినా గెలుపుపై ఇప్పటికీ నమ్మకం కలగటం లేదు. ఇటువంటి పరిస్ధితుల్లోనే వైసీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది మరికొద్ది గంటల్లో. అందులో పాల్గొనేందుకు జగన్ నంద్యాలకు బయలుదేరారు. ఆ విషయంపైన కూడా సమావేశంలో చర్చ జరిగింది.
ఉపఎన్నిక విషయంలో వైసీపీ ప్రధానంగా జగన్ కదలికలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందేట్లు ఏర్పాట్లు చేసుకోవాలని చంద్రబాబు ఆదేశించారట. నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం ఓటు బ్యాంకు చాలా ఎక్కువ. కాబట్టి ఒక్క ఓటు కూడా వైసీపీకి పోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. సరే, చంద్రబాబు ఆదేశిస్తే ముస్లిం ఓట్లన్నీ పడతాయా అంటే అది వేరే సంగతి. వీళ్ళ ప్రయత్నాలైతే వీళ్ళు చేయాలి కదా?
అందుకే సామాజికవర్గాల వారీగా ఓట్ల వివరాలను కూడా చర్చించుకున్నారు. భూమా మరణంతో తప్పనిసరైన ఎన్నిక కాబట్టి భూమామరణం తాలూకు సెంటిమెంటను వీలైనంతగా ఉపయోగించుకోవాలని సమావేశం నిర్ణయించింది. టిడిపి నుండి వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి చర్చ అనవసరమని, ఉన్న నేతల మధ్య సమన్వయంపైనే దృష్టి పెట్టాలని చంద్రబాబు స్పష్టం చేసారు. ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించటంతో పాటు యావత్ మంత్రివర్గమే కాకుండా 35 మంది ప్రజాప్రతినిధులను నియోజకవర్గంలో దింపిన తర్వాత కూడా చంద్రబాబులో ఇంత కలవరం కనబడుతోందంటే ఆశ్చర్యంగానే ఉంది.