
సమీక్షా సమావేశాలలో అగ్రహం వ్యక్తం చేయడం ఆయనకు బాగా అలవాటు. అందరి మీద అగ్రహిస్తే తప్ప తాను నిప్పులాంటి మనిషన్నది రుజువుకాదని ఆయన విశ్వాసం లాగా ఉంది. అందుకే ప్రతి సమీక్షా సమావేశంలో ఆయన ఒక వర్గం మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, బ్లాక్ లిస్టులో పెడతానని బెదిరించడం అనవాయితీ అయింది.
నోట్ల సంక్షోభం నేపథ్యంలో ఆయన బ్యాంకర్ల మీద నిప్పులు కురిపించి తాను నిప్పని మరొక సారి రుజువుచేసుకున్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఆయన సమావేశాలంటే భయపడే వారు. ఇపుడు ఆయన పరిధిలోలేని బ్యాంకర్లు కూడా ముఖ్యమంత్రి మీటింగ్ లంటే అదిరిపోతున్నారట.
తర్వాత ఆయన సిమెంట్ ఫ్యాక్టరీల ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విషయాన్ని ఒక అధికారిక ప్రకటనలో చక్కగా స్పష్టంగా చెప్పారు. పోలవరం ప్రాజక్టుపనులను దూరదర్శన పద్ధతిలో (అంటే వర్చువల్ రివ్వూ అంటే ప్రాజక్టు దగ్గిర అమర్చిన కెమెరాల ద్వార, డ్రోన్ లద్వార పరిశీలించి సమీక్షించడం) సమీక్ష జరుపుతు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం విజయవాడలోని తన కార్యాలయం నుంచి పోలవరం ప్రాజెక్ట్ పనులను వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు- సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రండేళ్లుగా ఇలా ఆయన అగ్రహిస్తూనే వున్నారు, బెదిరిస్తూనే ఉన్నారు, అయితే ఎవరిమీద చర్యలు తీసుకున్న దాఖలా లేదు.
పోలవరం నిర్మాణానికి సిమెంట్ లభ్యత, ధరలపై చర్చించేందుకు యాజమాన్యాలను తాను ఆహ్వానిస్తే, వాళ్లు గైర్హాజరై, సమావేశానికి తమ ప్రతినిధులను పంపించచారట.(ఆయన ఉపన్యాసాలతో వాళ్లకూ చిరాకేసిన అనుభవం ఉందేమో). ఇది ముఖ్యమంత్రిని ఖాతరు చేయకపోవడమే కదా. దీనితో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ పోలవరం ప్రాజెక్టు నా కోసం నిర్మించుకుంటున్నది కాదు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాల్సిన అవసరం ఉంది.’అని వారికి హితవు చెప్పారు.
కాంక్రీట్ పనులకు ముహూర్తం
కాంక్రీట్ పనులు ప్రారంభించటానికి వచ్చేనెల 14, 16 వ తేదీలలో శుభముహూర్తాలున్నాయని అధికారులు వివరించారు. మరోసారి మాట్లాడి ముహూర్తం నిర్ణయిద్దామని ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు. జనవరి మొదటి వారంలో డయాఫ్రం వాల్ పనులు, 14 కల్లా గేట్ల పనులు మొదలు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రాజెక్టు ప్రాంతంలో నిర్మించే రోడ్లకు సంబంధించి అనుమతులను త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.