Vangaveeti Radha‌ ఆఫీస్ వద్ద స్కూటీ కలకలం.. అనుమానస్పదంగా ఉండటంతో..

By Sumanth KanukulaFirst Published Dec 30, 2021, 3:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వంగవీటి రాధా (Vangaveeti Radha)  కామెంట్స్ గురించి తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసింది. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ రాధ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. ఆయన ఆఫీస్ వద్ద అనుమానస్పదంగా స్కూటీ పార్క్ చేసి ఉండటం కలకలం రేపింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వంగవీటి రాధా (Vangaveeti Radha)  కామెంట్స్ గురించి తీవ్ర చర్చ సాగుతున్న సంగతి తెలిసింది. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ రాధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే వంగవీటి రాధా ఆఫీస్ వద్ద అనుమానస్పదంగా స్కూటీ పార్క్ చేసి ఉండటం కలకలం రేపింది. Vangaveeti Radha ఆఫీస్ వద్ద గల స్వీట్ షాపు ముందు స్కూటీని మూడు రోజులుగా పార్క్ చేసి ఉంది. అయితే స్కూటీ ఎవరు పార్క్ చేశారో తెలియకపోవడంతో అనుమానంతో రాధా అనుచరులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. అనుమానస్పదంగా ఉన్న స్కూటీని తనిఖీ చేశారు. అనంతరం స్కూటీని అక్కడి నుంచి తరలించారు.

స్కూటీ ఓనర్ ఎవరని పోలీసులు గాలిస్తున్నారు. స్కూటీ అక్కడ ఎప్పుడు పార్క్ చేశారు..?, ఎందుకు పార్క్ చేశారనే విషయాలు తెలుసుకోవడాని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, వంగవీటి రాధా ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.

కృష్ణా జిల్లా గుడవల్లేరు మండలంలో వంగవీటి రంగ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో రాధా మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని చెప్పారు. ఇదే సభకు హాజరైన మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్ వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారని కొడాలి నాని చెప్పారు. రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్‌ డీజీని ఆదేశించారని తెలిపారు. రాధాకు ఎవరిపైనన్నా అనుమానాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని కూడా సీఎం సూచించారని చెప్పారు. 

Also Read: మా నాన్న రెక్కీ చేశాడనేది అబద్ధం.. ఆయన ఆరోగ్యం బాలేదు.. : అరవ సత్యం కొడుకు చరణ్ తేజ (వీడియో)

అయితే ప్రభుత్వం కల్పించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. గన్‌మన్లను వద్దని చెప్పిన మాట నిజమేనని ఆయన స్వయంగా వెల్లడించారు. తాను నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తినని.. అందుకే సెక్యూరిటీ వద్దన్నానని తెలిపారు.

మరోవైపు వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. గన్ మెన్ ను తిరస్కరించడం సరి కాదని ఆయన సూచించారు. భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. రాధాకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే వంగవీటి రాధాను హత్య చేసే ఉద్దేశంతో రెక్కీ నిర్వహించిన ఘటనపై చంద్రబాబు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. రెక్కీ నిర్వహించిన ఘటనపై దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆయన కోరారు.
 

click me!