సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. న్యాయవాదిని అనుమతించని అధికారులు..

By Sumanth KanukulaFirst Published Jan 28, 2023, 3:12 PM IST
Highlights

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. అయితే విచారణ జరుగుతున్న గదిలోకి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను అధికారులు అనుమతించలేదు. సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని విచారిస్తున్న నేపథ్యంలో.. సీబీఐ కార్యాలయం వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. మరోవైపు కొందరు వైసీపీ నేతలు కూడా సీబీఐ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే వారిని విచారణ జరుగుతున్న చోటుకు అనుమతించకపోయినప్పటికీ.. వారు అక్కడే వేచిచూస్తున్నారు. ఇక, సీబీఐ ఎస్పీ రామ్ సింగ్‌ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డిని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా విచారణ కొనసాగే అవకాశం ఉంది. 

ఇక, విచారణకు హాజరయ్యే ముందు.. సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

మరోవైపు సీబీఐ విచారణ హాజరు నేపథ్యంలో అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో విజయమ్మ నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లిన అవినాష్ రెడ్డి.. ఆమెతో దాదాపు 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం అవినాష్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ పరిణామాలు తీవ్ర సంచలనంగా  మారే అవకాశాలు కనిపిస్తుంది.

click me!