
జనసేన అధినేత పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నాననే విషయాన్ని పవన్ స్పష్టం చేశారని తెలిపారు. దీని వల్ల ఎక్కువగా బాధపడేది జనసైనికులేనని.. తమకేదో న్యాయం చేస్తాడని అనుకుంటే ఆయన అభిమానులకు ఏం చేయాలో వారికే తెలియని పరిస్ధితి ఏర్పడిందన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన కోటరీని జగన్ ఎప్పుడో ఎదుర్కొన్నారని చెల్లుబోయిన చెప్పారు. వారాహిని ఎందుకు లోపల పెట్టారు.. నారా లోకేష్ కోసమే పవన్ ఈ పనిచేశారని జనసైనికులకు కూడా అర్ధమైందన్నారు. టీడీపీ హయాంలో పవన్ ఒక్కసారైనా ప్రశ్నించారా అని గోపాలకృష్ణ నిలదీశారు. పవన్ తీరును చూసి జనసైనికులు కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
అంతకుముందు నిన్న సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో పేదవాడికి మంచి జరుగుతుంటే గత పాలకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. గత ప్రభుత్వానికి.. ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని ప్రజలను కోరారు. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబుకు పేదలు గుర్తుకువస్తారని విమర్శించారు. గత పాలకులకు, తనకు మధ్య తేడా ఉందని.. తాను చేసిన మంచిని నమ్ముకున్నానని, ప్రజలను, దేవుడిని నమ్ముకున్నానని చెప్పారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పొత్తులను, ఎత్తులను, కుయుక్తులను నమ్ముకున్నారని విమర్శించారు. రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలని అన్నారు.
సీఎం జగన్ బాపట్ల జిల్లాలోని నిజాంపట్నం వేదికగా ఐదో విడత వైఎస్సార్ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేశారు. బటన్ నొక్కి 1,23,519 మత్స్యకార కుటుంబాల ఖాతాల్లోకి రూ. 231 కోట్లను జమ చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం మత్స్యకారులకు అరకొర సాయం అందించిందనివిమర్వించారు. చంద్రబాబు హయాంలో ఇచ్చింది కేవళం రూ. 104 కోట్లేనని.. తమ ప్రభుత్వంలో ఒక్క ఏడాదిలోనే రూ. 231 కోట్లు ఇస్తున్నామని చెప్పారు.
Also Read: వివాహం చేసుకునేది వీళ్లే.. విడాకులు ఇచ్చేది వీళ్లే.. అధికారం లేకపోతే హైదరాబాద్లోనే: సీఎం జగన్ ఫైర్
14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క స్కీమ్ కూడా గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసం, కుతంత్రాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. పేదలకు ఏ మంచి చేయని చంద్రబాబుకు ఎందుకు మద్దతిస్తారని ప్రశ్నించారు. దత్తపుత్రుడు రెండు సినిమాల మధ్య షూటింగ్ విరామంలో పొలిటికల్ మీటింగ్లు పెట్టేందుకు వస్తాడని విమర్శించారు. చంద్రబాబు కాల్షీట్స్ ప్రకారం వచ్చి.. స్క్రిప్ట్ ప్రకారం ప్యాకేజీ స్టార్ మాట్లాడుతాడని.. తనపై నాలుగు రాళ్లు వేసి పోతాడని విమర్శించారు. ఇలాంటి వాళ్లకు ప్రజా జీవితం అంటే ఏమిటో తెలుసా?, ప్రజలకు మంచి చేయగలరా? అని ఆలోచన చేయాలని కోరారు.
వీళ్లు అధికారం ఉంటే అమరావతి.. అధికారం పోతే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉంటారని విమర్శించారు. అక్కడే వారి శాశ్వత నివాసం అని అన్నారు. రాష్ట్రం మీద గానీ, రాష్ట్రంలోని పేదల మీద గానీ, ప్రజల మీద గానీ వాళ్లకు ప్రేమ లేదని.. ఇక్కడ ఉండాలనే ఆలోచన కూడా లేదని విమర్శించారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో ఇళ్లు కట్టించుకున్నానని చెప్పారు. అక్కడే నివాసం ఉంటున్నానని తెలిపారు. కానీ 2014 నుంచి 2019 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. అప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ప్రజలు ఈ తేడాను గమనించాలని కోరారు.