కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద... రంగంలోకి ఎన్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

Published : Jul 14, 2022, 10:17 AM ISTUpdated : Jul 14, 2022, 10:23 AM IST
కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద... రంగంలోకి ఎన్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

సారాంశం

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద నీటితో గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. దీంతో దవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ప్రమాదకర స్థాయిలో వరద నీరు చేరుతోంది.   

అమరావతి : తెలుగురాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు పోటెత్తి గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.  తీర ప్రాంతాలు, లంక గ్రామాలను చుట్టుముడుతూ దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం ఈ బ్యారేజీలోకి ఇన్ ప్లో 15.52 క్యూసెక్కులు వుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే సముద్రంలోకి పంపుతున్నారు. గోదావరికి వరద ప్రవాహం మరింత పెరిగి ఇవాళ సాయంత్రానికి మూడవ ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం అయ్యింది.  

గోదావరిలో వరద ప్రవాహం పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని విపత్తుల సంస్థ అధికారులు సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వం ఏర్పాటుచేసిన రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్  నుంచి విపత్తుల శాఖ స్పెషల్ సిఎస్ జి.సాయిప్రసాద్, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ పర్యవేక్షిస్తున్నారు. 

విపత్కర పరిస్థితులు ఏర్పడితే వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టేలా 7 ఎన్డీఆర్ఎఫ్, 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్దం చేసారు. వీటిలో 4 బృందాలు అల్లూరి జిల్లాలో, 3 బృందాలు అంబేద్కర్ కోనసీమలో, 2 బృందాలు ఏలూరులో, 1 బృందం తూర్పుగోదావరి, 2 బృందాలు పశ్చిమగోదావరి జిల్లాల్లో సహాయక చర్యల కోసం సిద్దమయ్యాయి. 

వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒకవేళ మూడో ప్రమాద హెచ్చరిక జారీచేస్తే ప్రభావితం చూపే మండలాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ హెచ్చరించింది. 

read more  పోలవరం దగ్గర రికార్డు స్థాయిలో వరద ఉధృతి.. 48 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఇప్పటికే రెండు ప్రమాద హెచ్చరికలతో 40గ్రామాలు జలదిగ్భంధంలో మునిగిపోయాయి. గోదావరి ఉదృతి మరింత పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. దీంతో మరిన్ని గ్రామాలు, మరింతమంది ప్రజలపై ప్రభావం చూపనుందని... ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. 

ఇక ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ వద్ద కూడా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా వరద నీరు గోదావరి నదిలోకి చేరుతోంది. దీంతో పాపికొండల నడుమ గోదావరి మహోగ్రరూపంలో ప్రవహిస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. దీంతో వరదను నియంత్రించే విధంగా హైడ్రాలిక్ పద్ధతిలో ఏర్పాటు చేసిన 48 గేట్లను విజయవంతంగా ఆపరేట్ చేస్తున్నారు. దీంతో తక్కువ సమయంలోనే స్పిల్ వే చానల్ ద్వారా 15లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్ చానెల్ మీదుగా దిగువకు విడుదల చేశారు. 

ఇలా గోదావరి నదిలోకి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో భద్రాచలం వద్ద ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గోదవరిలో నీటిమట్టం 60 అడుగులకు చేరుకోవడంతో భద్రాచలం జలదిగ్భందంలో మునిగిపోయింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 

మూడువైపుల నుండి భద్రాచలంకు రాకపోకలు నిలిచిపోగా కేవలం కొత్తగూడెం వైపునుండి మాత్రమే వెళ్లడానికి అవకాశముంది. నదిలో నీటిమట్టం మరింత పెరిగితే ఆ మార్గంలో కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Chairman Sudden Visit: 3నెలల నుండి డబ్బులు రావడంలేదు సార్ | Asianet News Telugu
క్షణాల్లో మంటలు.. 8 మందిని రక్షించా: Markapuram Bus Accident ప్రత్యక్ష సాక్షి | Asianet News Telugu