జగన్‌తో ముగిసిన బాలినేని భేటీ.. నన్ను ఇబ్బంది పెట్టిందెవరో చెప్పా , పార్టీ మారను : శ్రీనివాస్ రెడ్డి

By Siva KodatiFirst Published Jun 1, 2023, 6:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు వున్నాయని.. పార్టీ మారాల్సిన అవసరం లేదని బాలినేని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సమావేశం ముగిసింది. తాను అలగలేదని.. పార్టీలో కొందరు తనను ఇబ్బందిపెట్టారని బాలినేని పేర్కొన్నారు. పార్టీలో తనను ఇబ్బందిపెట్టిన వారిపై ఫైట్ చేశానని ఆయన తెలిపారు. సీఎంను తాను కలవడంలో కొత్తేమి లేదన్న ఆయన.. గతంలో వారానికి ఒకసారి జగన్‌తో భేటీ అయినట్లు గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి పెండింగ్‌లో వున్న సమస్యలపైనా జగన్ దృష్టికి తీసుకెళ్లానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.  పార్టీలో విభేదాలను పరిష్కరిస్తానని జగన్ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. జగన్‌తో తనకు సన్నిహిత సంబంధాలు వున్నాయని.. పార్టీ మారాల్సిన అవసరం లేదని బాలినేని స్పష్టం చేశారు. స్థానికంగా పార్టీ పరిస్ధితిని సీఎం దృష్టికి తీసుకెళ్లానని ఆయన తెలిపారు. 

కాగా.. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి గత నెలలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి బాలినేని తప్పకున్నారు. ప్రస్తుతం బాలినేని శ్రీనివాస్ రెడ్డి నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజిన‌ల్ కో-ఆర్టినేటర్‌గా ఉన్నారు. దీనిపై పలుమార్లు జగన్ ఆయనతో మాట్లాడి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. 

ALso Read: జగన్ కు బిగ్ షాక్.. కీలక బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..!

ఇదిలా ఉంటే.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు బంధువనే సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలో వచ్చాక జగన్ తన మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. అయితే ఆ తర్వాత  మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో.. బాలినేనిని మంత్రి పదవి నుంచి తొలగించారు. అయితే బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. స్వయంగా జగన్ రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. 

ఇక, ఇటీవల సీఎం జగన్ ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో మార్కాపురంలో హెలిప్యాడ్ వద్దకు వెళ్లడానికి వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వాహనం పక్కన పెట్టి నడిచి రావాలని సూచించారు. దీంతో పోలీసుల తీరుపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కార్యక్రమం నుంచి వెనుదిరిగి వెళ్లిపోయేందుకు సిద్దమయ్యారు. అయితే బాలినేని సర్దిచెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీలు ప్రయత్నించారు. అయితే బాలినేని అక్కడి నుంచి వెనుదిరిగేందుకే నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో పాల్గొనకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే సీఎంవో నుంచి బాలినేనికి ఫోన్ కాల్ వెళ్లడంతో.. ఆయన తిరిగివచ్చి  కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

click me!