
ప్రకాశం జిల్లాలోని మరో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది.. ఇప్పటికే జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఈ పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా కందుకూరు నియోజకవర్గంలో ఇది మరింత ముదిరింది. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాంలు ఒకరికపై మరొకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు.
గత ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున దివి శ్రీరాం, వైసీపీ నుంచి పోతుల రామారావు పోటీ చేశారు. అయితే..ఆ పోటీలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచే వీరిద్దరి నుంచి వైరం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీలో ఉంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేమని.. అందుకే అధికార పార్ట అయిన టీడీపీలో చేరతున్నట్లు పోతుల ప్రకటించాడు.
పోతుల టీడీపీలో చేరాక వారిద్దరి మధ్య వైరం మరింత పెరిగిపోయింది. దివి శ్రీరాం.. కందుకూరు నియోజకవర్గానికి పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పార్టీ క్యాడర్ అంతా దివి చేతిలో ఉండగా.. ఎమ్మెల్యేగా గెలిచిన పోతుల చేతిలో అధికారం ఉంది. దీంతో ఇద్దరి మధ్య సమన్వయం లేక.. వివాదాలు ముదురుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికలు దగ్గరిలో ఉండటంతో.. వివాదం మరింత ఎక్కువైంది. రానున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి తమకే సీటు కేటాయించాలని ఇద్దరు నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
వీరిద్దరి విషయం కూడా చంద్రబాబుకి తలనొప్పిగానే మారింది. పోతుల రామారావుకి సీటు ఇస్తామంటే.. దివి శ్రీరాంతోపాటు ఆయన మద్దతుదారులు, కార్యకర్తలు అంగీకరించడం లేదు.ఆయన వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి సీటు ఇస్తే ఒప్పుకోమని వారు వాదిస్తున్నారు. ఇక పోతుల ని కాదని దివి శ్రీరాం కి ఇస్తామంటే ‘ రానున్న ఎన్నికల్లో సీటు ఇస్తామని అంగీకరిస్తేనే టీడీపీలో చేరాను.. ఇప్పుడు కాదంటే ఊరుకోను. కచ్చితంగా సీటు నాకే ఇవ్వాలి’ అంటూ పోతుల డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికే చీరాల, మాటూరు, దర్శి, అద్దంకి నియోజకవర్గాల్లో ఇదేరకమైన ఆదిపత్య పోరు కొనసాగుతోంది. వీటినే ఎలా పరిష్కరించాలని భావిస్తున్న చంద్రబాబుకి కందుకూరు మరో తలనొప్పిగా మారింది.