Cyclone Jawad: విశాఖలో హైఅలర్ట్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మోహరింపు

By narsimha lodeFirst Published Dec 3, 2021, 3:25 PM IST
Highlights

జవాద్ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్టణంలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎప్ సిబ్బందిని మోహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్లను అందించారు.
 

విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై cyclone jawad తీవ్ర ప్రభావాన్ని చూసే అవకాశం ఉందని Imd శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలో రెస్క్యూ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.మూడు Ndrfబృందాలతో పాటు 45 మందితో Sdrf సిబ్బందిని రంగంలోకి దించారు. జీవీఎంసీ పరిధిలో 21 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. Visakhapatnam జిల్లాలోని ఏడు రిజర్వాయర్లలో అత్యవసర పరిస్థితుల్లో నీటిని విడుదల చేయడానికి ఇరిగేషన్ అధికారులను సిద్దం చేశారు.Gvmc, రెవిన్యూ, పోలీస్, పంచాయితీరాజ్, రోడ్లు భవనాల శాఖాధికారులతో సమన్వయం  చేసుకొంటూ  సహాయక చర్యలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. cyclone ప్రభావంతో గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే చెట్లు విరిగిపడే ప్రమాదం ఉంది. దీంతో జేసీబీలతో పాటు చెట్లను కట్ చేసే యంత్రాలను కూడా సిద్దం చేసుకొన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖలో control  రూమ్స్ ఏర్పాటు చేశారు. 0891-2590100,0891-2590102,0891-2750090,  నెంబర్లకు ఫోన్లు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉత్తరాంధ్రలోని విశాఖకు ఆగ్నేయంగా దాదాపు 516  కిలోమీటర్ల దూరంలో జవాద్ తుఫాన్ కేంద్రీకృతమై ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇది గంటకు 32 కిలోమీటర్ల వేగంతో తీరంవైపుగా కదులుతున్నట్టు IMD వెల్లడించింది. ఇవే పరిస్థితులు కొనసాగితే శనివారం(రేపు) ఉదయానికి ఇది ఉత్తర కోస్తాంధ్ర- దక్షిణ ఒడిశా పరిసరాల్లో తీరాన్ని దాటవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అక్కడక్కడా చిరుజల్లులు కూడా ప్రారంభమయ్యాయి. తుపాను తీరానికి దగ్గరయ్యేకొద్ది వర్షతీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

also read:Cyclone Jawad: తుఫానుగా మారిన వాయుగుండం... విశాఖకు 516కి.మీ దూరంలో కేంద్రీకృతం

విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిపై తుఫాను ప్రభావం ఎక్కువగా వుండనుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాంగమంతా ఇప్పటికే అప్రమత్తమై ప్రమాదం పొంచివున్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలోపడ్డారు.  ఇక ఉభయగోదావరి జిల్లాలకు అధికారులు తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. తుపాను దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా, డివిజన్‌ కేంద్ర కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షించనున్నారు. రక్షణ, సహాయశాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. తుపాను ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.ఇవాళ సాయంత్రం నుంచే ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు తీరంవెంబడి గంటకు సుమారు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ గాలుల ధాటికి విద్యుత్తు స్తంభాలు, చెట్లు కూలిపోయే ప్రమాదంతో పాటు వర్షపునీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదముంది కాబట్టి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.  

click me!