
విశాఖపట్నంలో రేపు జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ 2022లో (president fleet review) పాల్గోనేందుకు విచ్చేసిన భారత రాష్ట్రపతి రామనాధ్ కొవింద్ (ramnath kovind) దంపతులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట మంత్రి కురసాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా ఉన్నతాధికారులు వున్నారు. రాష్ట్రపతితోపాటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విశాఖలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయుధ దళాల సుప్రీం కమాండర్గా వ్యవహరించే రాష్ట్రపతి.. తన పదవీకాంలో ఒకసారి నౌకాదళం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు చేశారు.
అంతకుముందు.. ఒడిశాలో నిర్వహించిన గౌడియా మఠ్, మిషన్ వ్యవస్థాపకుడు శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపద్ 150వ జయంత్యుత్సవాల ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొని ప్రసంగించారు. కులం (Caste), లింగం (Gender), మతం (Religion) ఆధారంగా మానవజాతిని (Humanity) విభజించవద్దని అన్నారు. భారత సంస్కృతిలో అవసరార్థులకు సేవలు చేయడమే తొలి ప్రాధాన్యత అని రాష్ట్రపతి వివరించారు. భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో భిన్నమైన మత ఆచార, వ్యవహారాలు ఉన్నాయని తెలిపారు. కానీ, వాటన్నింటిలోనూ కామన్గా కనిపించేది.. మానవజాతి మొత్తాన్ని కుటుంబంగా భావించి వారికి సేవలు చేయడమేనని రామ్నాథ్ కోవింద్ వివరించారు.
ఇదే స్ఫూర్తి కరోనా కష్టకాలంలో హెల్త్ వర్కర్లు, నర్సులు, డాక్టర్లలో కనిపించిందని రాష్ట్రపతి అన్నారు. అనేక మంది వారి సహోద్యోగులు కరోనా బారిన పడుతున్నప్పటకీ వారు ప్రజలకు సేవ చేయడంలో వెనుకంజ వేయలేదని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. ఎంతో మంది కొవిడ్ వారియర్లు తమ జీవితాలను త్యాగం చేశారని వివరించారు. అయినప్పటికీ మిగతా వారూ వారి ప్రాణాలను పణంగా పెట్టి ప్రజా సేవకు అంకితం అయ్యారని రాష్ట్రపతి చెప్పారు. భక్తి భావంతో దైవాన్ని కొలవడం దేశవ్యాప్తంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. సమాజంలో నెలకొన్న మతాలు, కులాలు, లింగ బేధం, సంప్రదాయాల్లో తారతమ్యం వంటివి దేశ సాంస్కృతిక వైవిద్యాన్ని బలోపేతం చేసేలా భక్తి మార్గం ఉన్నదని వివరించారు. భక్తి మార్గంలోని సన్యాసులు అందరూ ఒకరు మరొకరితో విభేదించబోరని తెలిపారు. అయితే, ఒకరి బోధనలను ఇంకోసారి స్ఫూర్తిగా తీసుకుంటారని పేర్కొన్నారు.