ఏపీ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లోనూ మార్పులు

Siva Kodati |  
Published : Feb 20, 2022, 08:06 PM IST
ఏపీ ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: హెచ్ఆర్ఏ 24 శాతానికి పెంపు, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లోనూ మార్పులు

సారాంశం

ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 వ తేదీ నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది

ఉద్యోగ సంఘాల నేతలకు ఏపీ ప్రభుత్వం (ap govt) శుభవార్త చెప్పింది. ఇటీవల మంత్రుల కమిటీతో జరిగిన ఒప్పందం మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ (ap prc) అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌ఓడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 వ తేదీ నుంచి హెచ్‌ఆర్‌ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా పీఆర్సీలో మొదట 16 శాతం మేర మాత్రమే హెచ్‌ఆర్‌ఏ పెంపు సిఫార్సు చేసినప్పటికీ, మంత్రుల కమిటీతో కుదిరిన ఒప్పందం మేరకు 24 శాతం వర్తింప చేస్తూ జీవోలో పేర్కొంది.  

అలాగే హెచ్‌ఆర్‌ఏ (hra) గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఏపీ భవన్‌, హైదరాబాద్‌లలో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ వర్తిస్తుందని వెల్లడించారు. అదే విధంగా 2.50 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్‌ పే పైన 16 శాతం హెచ్‌ఆర్‌ఏ లేదా రూ.17 వేల సీలింగ్‌ను నిర్ణయించారు. అదేవిధంగా 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్‌ఆర్‌ఏను రూ.13 వేలకు మించకుండా సీలింగ్‌ విధించారు. అలాగే 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 10 శాతం లేదా 11 వేల రూపాయలు మించకుండా హెచ్‌ఆర్‌ఏ ఇవ్వనున్నారు.

కాగా పీఆర్సీ ఉత్తర్వులతో పాటు 2022 ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతన, పెన్షన్‌ బిల్లులను సిద్ధం చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఓడీలు, సచివాలయ ఉద్యోగులకు, విశాఖపట్నం, విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు సిటీ కంపన్సేటరీ అలవెన్సును కూడా నిర్ధారిస్తూ ఉత్తర్వుల్లో తెలిపింది. ఇక పెన్షన్‌ చెల్లింపుల్లో 70 ఏళ్లు దాటిన వారికి క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ (quantum of pension) అమలులో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. 

దీని ప్రకారం 70 ఏళ్ల వయసున్న రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్‌ అందనున్నది. 75 ఏళ్ల వయసు వారికి అదనంగా 12 శాతం, 80 ఏళ్ల వారికి అదనంగా 20 శాతం, 85 ఏళ్లు వారికి అదనంగా 25 శాతం, 90 ఏళ్ల వయసు వారికి అదనంగా 30 శాతం, 95 ఏళ్ల వయసున్న రిటైర్డ్‌ ఉద్యోగికి అదనంగా 35 శాతం, వందేళ్ల వయసున్న వారికి అదనంగా 50 శాతం పెన్షన్‌ అందుతుంది.
 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu