శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం, కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్.. “ఆపరేషన్ సిందూర్”లో భాగంగా దేశ రక్షణ కోసం అమిత సాహసంతో పోరాడుతూ గురువారం రాత్రి వీరమరణం పొందారు. ఈ వార్త వినగానే కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
దేశ రక్షణలో శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు నివాళులు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా జమ్మూ కశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ మన రాష్ట్రానికి చెందిన మురళి నాయక్ వీరమరణం పొందడం నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డంతాండ పంచాయతీ కళ్లి తాండా గ్రామానికి చెందిన మురళి నాయక్ చూపిన ధైర్య,సాహసాలు రాష్ట్రానికే గర్వకారణం. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్రప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తాం. ఆయన కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తాం. అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
జవాన్ మురళీ నాయక్ పార్థివదేహం శనివారం స్వగ్రామానికి చేరుకోనుంది. ఆయన చూపించిన తెగువ, ధైర్యం, సాహసం, దేశంపై నిబద్ధత భావితరాలకు స్ఫూర్తిగా నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.