
శ్రీకాకుళం: గేట్లు దూకి తమ ఇంట్లోకి ఏసీబీ అధికారులు వచ్చారని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు సతీమణి మాధవి ఆరోపించారు. కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఇంటి నుండి తీసుకెళ్లారన్నారు.
శుక్రవారం నాడు ఆమె శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి రోజూ ఉదయం ఐదున్నర గంటలకు నిద్ర లేస్తామన్నారు. నిద్ర లేచి అచ్చెన్నాయుడు కూర్చొన్నాడన్నారు.
also read:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్: ఈఎస్ఐ స్కామ్ ఏమిటి?
కొద్దిసేపటికే ఏసీబీ అధికారులు తమ ఇంట్లోకి ప్రవేశించారన్నారు. ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని చూసి తమకు చెప్పారన్నారు. ఏసీబీ అధికారులు గేట్లు దూకి వస్తారని తెలిస్తే తాము కూడ మనుషులను ఏర్పాటు చేసుకొనేవాళ్లమని ఆమె తెలిపారు.
also read:ఈఎస్ఐ స్కామ్లో అచ్చెన్నాయుడుతో పాటు వీళ్లను అరెస్ట్ చేశాం: ఏసీబీ డీజీ రవికుమార్
కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారు. అచ్చెన్నాయుడుకు ఆరోగ్యం సరిగా లేదన్నారు. ఇటీవలనే ఆయనకు సర్జరీ జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
దౌర్జన్యంగా ఇంటి నుండి తీసుకెళ్లారని ఆమె ఆరోపించారు. గన్మెన్ ను నరసన్నపేట నుండి వెనక్కి పంపారన్నారు. దౌర్జన్యంగా తన తండ్రిని తీసుకెళ్లారని అచ్చెన్నాయుడు కొడుకు మీడియాకు చెప్పారు.
ఏసీబీ అధికారులు తీసుకెళ్తున్న సమయంలో వీడియోలు తీయకుండా తమ ఫోన్లను కూడ ఏసీబీ అధికారులు లాక్కొన్నారన్నారు.