నిమ్మగడ్డకు దొరకని గవర్నర్ అపాయింట్ మెంట్: ఎన్నికల ప్రతిష్టంభన

Published : Jan 25, 2021, 10:26 AM IST
నిమ్మగడ్డకు దొరకని గవర్నర్ అపాయింట్ మెంట్: ఎన్నికల ప్రతిష్టంభన

సారాంశం

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం సహాయ నిరాకరణ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. అయితే ఇప్పటి వరకు ఆయనకు గవర్నర్ అపాయింట్ మెంట్ లభించలేదు.

అమరావతి: గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అపాయింట్ మెంట్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగ సహాయ నిరాకరణ చేస్తున్న నేపథ్యంలో విషయాన్ని ఆయన గవర్నర్ కు విన్నవించాలని ఆయన భావిస్తున్నారు. 

శనివారంనాడు సాయంత్రం నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు హాజరు కాలేదు. దాంతో ఆయన గవర్నర్ ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే, ఆయనకు ఆ రోజు గవర్నర్ అపాయింట్ మెంట్ లభించలేదు. దీంతో ఆయన హైదరాబాదుకు వెళ్లిపోయారు. తిరిగి సోమవారం ఉదయం ఆయన విజయవాడలోని కార్యాలయానికి వచ్చారు. మరోసారి ఆయన గవర్నర్ అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. అయితే, రాజభవన్ నుంచి ఆయనకు ఏ విధమైన సమాచారం రాలేదు.

Also Read: నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు షాక్: ఏపీలో ఎన్నికలపై తీవ్ర సందిగ్ధత

ఇదే సమయంలో గవర్నర్ తో భేటీ కోసం రాజభవన్ మీద ఒత్తిడి పెరిగింది. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ కోరారు. వారికి కూడా గవర్నర్ అపాయింట్ మెంట్ లభించలేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనే గవర్నర్ ఎవరికైనా అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అంటన్నారు. 

సోమవారం ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావాల్సి ఉంది. ఆయన నామినేషన్ల స్వీకరణకు ఇప్పటి వరకు కూడా ఏ విధమైన ఏర్పాట్లూ జరగలేదు. కాగా, సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు సోమవారం విచారణకు రానుంది. ఈ స్థితిలో అందరి దృష్టి సుప్రీంకోర్టు మీదనే ఉంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తాము పాటిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది.

Also Read: అదృశ్య శక్తి చంద్రబాబేనా...: నిమ్మగడ్డకు ముద్రగడ ఘాటు లేఖ

కాగా, ఎన్నికల ప్రక్రియ మాత్రం ప్రారంభమవుతుందని, సుప్రీంకోర్టు తీర్పు ఆ తర్వాత వస్తే దాని ప్రకారం నడుచుకుంటామని రమేష్ కుమార్ శనివారంనాడు చెప్పారు. ఆయన శనివారంనాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. దానికి ప్రభుత్వం నుంచి ఏ విధమైన స్పందన కూడా లేదు. దీంతో ఎన్నికలు జరగడం సాధ్యం కాని అనూహ్యమైన పరిస్థితి ఏర్పడింది.

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu