తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఎవరెలా విషెస్ తెలిపారంటే…
Telangana Formation Day 2025 : భారతదేశంలో అతి తక్కువ వయసుగల రాష్ట్రం తెలంగాణ.. నేడు (జూన్ 2 సోమవారం) 11 సంవత్సరాలు పూర్తిచేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఇలా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగురాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా పలువురు కేంద్రమంత్రులు, ఇరురాష్ట్రాల మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ ప్రజలకు శుభాంకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు ఎవరు ఎలా విషెస్ తెలిపారో ఇక్కడ చూద్దాం.
తెలంగాణ ప్రజలకోసం ప్రధాని మోదీ ఏం కోరుకున్నారంటే...
తెలంగాణ ఆవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికన ఆసక్తికర కామెంట్స్ చేసారు. ''తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి అవిరళమైన కృషి చేసినందుకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో, రాష్ట్ర ప్రజల 'జీవన సౌలభ్యాన్ని' పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలకు విజయాలు, సంపదలు కలిగేలా ఆశీర్వాదాలు లభించాలని కోరుకుంటున్నాను'' అంటూ ప్రదాని విషెస్ తెలిపారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ విషెస్ :
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన కాస్త కవితాత్మకంగా పాలన ఎలా సాగించాలో చెబుతూ విషెస్ తెలిపారు.
''అమరుల ఆశయాలకు…
ప్రజల ఆకాంక్షలకు…
పేదల సంక్షేమానికి…
రైతుల సాగు స్వప్నాలకు…
ఆడబిడ్డల ఆర్థిక స్వావలంబనకు…
యువత బంగారు భవితకు…
తెలంగాణ రైజింగ్ విజన్ కు…
ఈ శుభదినోత్సవాన…పునరంకితమవుదాం.
రాష్ట్ర ప్రజలకు… ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు'' అంటూ ఎక్స్ వేదికన స్పందించారు.
తెలుగు రాష్ట్రాలు వేరైనా ప్రజలు మాత్రం ఒక్కటే : చంద్రబాబు నాయుడు
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాక్షలు తెలియజేసారు. '' తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు'' అన్నారు.
''తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ వికసిత్ భారత్-2047 నాటికి అగ్రస్థానానికి చేరుకోవాలని, తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని.. ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిస్తున్నాను'' అంటూ ఎక్స్ వేదికన తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కోరుకున్నారు చంద్రబాబు.
జనసేన జన్మ, నాకు పునర్జన్మ ఇచ్చిన గడ్డకు శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ''జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ'' అన్నారు.
‘’రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అంటూ పవన్ కల్యాణ్ తెలంగాణకు విషెస్ తెలిపారు.