Kohli: ఫైనల్లో ఆర్సీబీ గెలిస్తే ఐపీఎల్కు కోహ్లీ గుడ్బై చెప్తారా?
Virat Kohli: ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఐపీఎల్ 2025 ఫైనల్ బెంగళూరు-పంజాబ్ మ్యాచ్ కు ముందు ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
హాట్ టాపిక్ గా విరాట్ కోహ్లీ
Virat Kohli: భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఇప్పటికే టెస్టు క్రికెట్, టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత జట్టు టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మట్ నుంచి కోహ్లీ తప్పుకున్నాడు. ఇంగ్లాండ్ తో 5 టెస్టు మ్యాచ్ ల కీలక సిరీస్ కు ముందు సుదీర్ఘ ఫార్మట్ నుంచి తప్పుకోవడం అందరిని షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం మరోసారి విరాట్ కోహ్లీ పేరు హాట్ టాపిక్ గా మారింది.
ఐపీఎల్ కు కోహ్లీ రిటైర్మెంట్?
పూర్తి ఫిట్ గా ఉన్న కోహ్లీ మరికొంత కాలం భారత టెస్టు జట్టులో కొనసాగాల్సిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి సంబంధించి మరో రిటైర్మెంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. అదే ఐపీఎల్ కు గుడ్ బై చెప్పడం. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత కోహ్లీ టోర్నీ నుంచి కూడా తప్పుకుంటారన్నసందేహాలు రేకెత్తుతున్నాయి. ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాల్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇదే విషయంపై కొత్త చర్చకు తెరలేపాయి.
బెంగళూరు vs పంజాబ్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు ముందు అరుణ్ ధూమాల్ ఏమన్నారంటే?
జూన్ 3న గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) - పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్ జరగనుంది. ఇది ఆర్సీబీకి చారిత్రాత్మక మ్యాచ్గా మారబోతోంది. ఆర్సీబీ అభిమానులు తమ జట్టు తొలిసారి టైటిల్ గెలుస్తుందన్న నమ్మకంతో సంబరాలకు సిద్ధమవుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమాల్ చేసిన ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఆసక్తికర చర్చలకు దారితీసింది. “విరాట్ కోహ్లీ ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించకూడదు. ఆయన మరింత కాలం ఈ లీగ్లో కొనసాగాలి. ఆర్సీబీ ఈసారి టైటిల్ గెలిచినా, కోహ్లీ క్రికెట్కి దూరం కాకూడదు” అని ధూమాల్ అన్నారు.
విరాట్ కోహ్లీ ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా?
అరుణ్ ధూమాల్ వ్యాఖ్యలతో కోహ్లీ ఐపీఎల్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలనే ఉద్దేశంతో లండన్లో స్థిరపడే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
అరుణ్ ధూమాల్ మాట్లాడుతూ.. “విరాట్ కోహ్లీ ఫిట్నెస్ను ఎవ్వరూ సరితూగలేరు. ఆయన్ను టెస్ట్ క్రికెట్కి మళ్లీ పిలవాలని నా మనవి. అలాగే ఐపీఎల్ నుండి కోహ్లీ రిటైర్ అవుతారని నేను నమ్మను. టెన్నిస్ లో రోజర్ ఫెదరర్, డోకోవిచ్లా క్రికెట్ కు విరాట్ కోహ్లీ ఒక లెజెండ్” అని అన్నారు.
కోహ్లీ ఆర్సీబీకి ఐపీఎల్ టైటిల్ అందిస్తాడా?
ఆర్సీబీ జట్టులో గత 18 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టు యాజమాన్యం, కోచ్, సహచరులు మారినా, విరాట్ కోహ్లీ మాత్రం స్టేబుల్గా ఆ జట్టుకు కీలకంగా నిలిచారు. మొదటి సీజన్ నుంచి ఇప్పటివరకు ఆర్సీబీకే ఆడుతున్నాడు.
ఈసారి ఆర్సీబీ టైటిల్ గెలిచే అవకాశం మెండుగా కనిపిస్తోంది. దీంతో కోహ్లీ రిటైర్మెంట్ విషయంపై ధూమాల్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఐపీఎల్ 2025 ఫైనల్ తర్వాత కోహ్లీ భవిష్యత్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.