Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో 50 విజయాల మైలురాయిని అధిగమించిన ఐదో కెప్టెన్గా నిలిచాడు. అయ్యర్ సూపర్ నాక్ తో పంజాబ్ కింగ్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్కు చేరింది. టైటిల్ పోరులో ఆర్సీబీతో తలపడనుంది.
Shreyas Iyer: ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ (PBKS) ఫైనల్కు చేరింది. ఆహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ (MI) పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ టికెట్ దక్కించుకుంది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు. ఐపీఎల్లో 50 విజయాలను నమోదు చేసిన ఐదో కెప్టెన్గా నిలిచాడు.
ఐపీఎల్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ మరో ఘనత
శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోల్కతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS) జట్లకు కెప్టెన్గా వ్యవహరించాడు. అతను మొత్తం 85 మ్యాచ్లకు నాయకత్వం వహించి, 50 మ్యాచ్ లను గెలిచాడు. ఇందులో రెండు మ్యాచ్లు సూపర్ ఓవర్ విజయాలు కూడా ఉన్నాయి. అయ్యర్ కెప్టెన్సీలో 34 మ్యాచ్ల్లో ఓడిపోయాడు. రెండు మ్యాచ్లు ఫలితం లేకుండానే ముగిశాయి. అయ్యర్ విజయాల శాతం 57% కన్నా ఎక్కువగా ఉంది.
మూడు జట్లను ఫైనల్ కు తీసుకెళ్లిన శ్రేయాస్ అయ్యర్
2020లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఫైనల్కు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. ఆ జట్టుకు కెప్టెన్ గా 41 మ్యాచ్లలో 23 విజయాలు అందించాడు. కేకేఆర్ కు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ఆ జట్టుకు మూడో ఐపీఎల్ టైటిల్ అందించాడు. మొత్తం 29 మ్యాచ్ల్లో 17 విజయాలు ఉన్నాయి. ఇప్పుడు 2024లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తూ, 15 మ్యాచ్లలో 9 విజయాలతో జట్టును లీగ్ దశలో పాయింట్ల పట్టికలో టాప్లోకి తీసుకెళ్లాడు.
ఇక్కడ అతని గెలుపులు 60 శాతంగా ఉన్నాయి. మూడు విభిన్న జట్లను ఐపీఎల్ ఫైనల్కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కావడం గమనార్హం. అలాగే, వరుసగా రెండు సీజన్లలో రెండు వేర్వేరు జట్లను లీగ్ దశలో టాప్కు చేర్చిన కెప్టెన్గానూ రికార్డు నెలకొల్పాడు. 2024లో కేకేఆర్, 2025లో పంజాబ్ కింగ్స్ లను టేబుల్ టాపర్ గా నిలిపాడు అయ్యర్.
ఐపీఎల్ కెప్టెన్సీ చరిత్రలో 50+ విజయాలు అందుకున్న లెజెండ్స్ వీరే
• ఎంఎస్ ధోనీ – 136
• రోహిత్ శర్మ – 87
• గౌతమ్ గంభీర్ – 71
• విరాట్ కోహ్లీ – 66
• శ్రేయస్ అయ్యర్ – 50
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పరుగుల వర్షం
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 203/6 స్కోర్ చేసింది. రోహిత్ శర్మ 8 పరుగులకే అవుట్ కాగా, జానీ బెయిర్ స్టో 24 బంతుల్లో 38 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 44, సూర్యకుమార్ యాదవ్ 44 పరుగులు చేశారు. నమన్ ధీర్ 37 పరుగులతో సునామీ నాక్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఓమర్జాయ్ 2/43 తీయగా, జేమీసన్, స్టోయినిస్, వైషాక్, చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కు మంచి ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ (6 పరుగులు), ప్రియాంష్ ఆర్య (20 పరుగులు) త్వరగా అవుట్ అయ్యారు. జోష్ ఇంగ్లిస్ 38 పరుగులు, నేహాల్ వధేరా 48 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 87 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో పంజాబ్ కింగ్స్ కు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు.