PM Narendra Modi speech in Adampur: ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంలో మన సైన్యం పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. "మనోళ్ల సింధూరాన్ని దూరం చేస్తే.. ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేశాం" అంటూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PM Narendra Modi speech in Adampur: పంజాబ్లోని ఆదంపూర్ వాయుసేన స్థావరంలో మంగళవారం జరిగిన ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ భారత రక్షణ శక్తిని ప్రశంసించారు. పాకిస్థాన్ చేసిన ఇటీవలి దాడులపై భారత సాయుధ దళాలు చూపిన ధైర్యసాహసాలను కొనియాడుతూ.. "ఇంకోసారి ఉగ్రదాడి జరిగితే, భారత్ ఘాటుగా ప్రతిస్పందిస్తుంది" అని హెచ్చరించారు.
మనపై దాడి చేస్తే ఏం జరుగుతుందో ఇప్పటికే ప్రపంచం చూసిందని అన్నారు. ఆదంపూర్ బేస్ లో ప్రధాని మోడీ మన సైనికులతో మాట్లాడుతూ.. "దాడి చేస్తే ఘాటుగా ప్రతిస్పందిస్తాం.. మనోళ్ల సింధూరాన్ని దూరం చేస్తే.. ఏం జరిగిందో ప్రపంచం చూసింది. ఉగ్రవాదుల ఇళ్లలోకి దూరి మరీ చంపేశాం" అంటూ ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ దాడులతో ఆదంపూర్ స్థావరం నాశనం అయిందనే ఆరోపణలు, ప్రచారానికి తన పర్యటనతో ప్రధాని మోడీ చెక్ పెట్టారు. అక్కడ రష్యన్ తయారీ S-400 క్షిపణి వ్యతిరేక వ్యవస్థ బాగానే ఉందని స్పష్టం చేశారు.
"భారత సాయుధ దళాలు పాకిస్థాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులను మట్టికరిపించాయి. మన డ్రోన్లు, క్షిపణులతో వారికి నిద్ర లేకుండా పోయింది" అని మోడీ పేర్కొన్నారు. గత వారం పాకిస్థాన్ చేసిన దాడులను ఎదుర్కొన్న సైనికుల ధైర్యాన్ని ప్రశంసిస్తూ, దేశ రక్షణలో చేసిన సేవలకు అభినందనలు తెలిపారు.
"ప్రతి భారతీయుడూ మీ పోరాటంతో గర్విస్తారు... మీరు చరిత్రను రాసారు. మీ ఆశీస్సుల కోసమే నేను వచ్చాను. మీరు ఈ తరం, రాబోయే తరాలకు ప్రేరణ" అని మోడీ అన్నారు. అలాగే, "ఉగ్రవాదులు మనపై దాడి చేస్తే వారిని నేరుగా ఎదుర్కొన్నాము.. వారి ఉగ్ర స్థావరాలను నాశనం చేసి, 100 మంది ఉగ్రవాదులను హతమార్చాము. ఇకపై మనపై దాడి చేయాలని ఆలోచించినా, నెక్స్ట్ వారి విధ్వంసమే అవుతుంది" అని ప్రధాని మోడీ వార్నింగ్ ఇచ్చారు.