tragic stampede at UP's Hathras : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం ఘోర‌ విషాదం నెలకొంది. ఇక్క‌డ జ‌రిగిన‌ ' సత్సంగ్ ' (మతపరమైన సమావేశం) సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. తొక్కిస‌లాట‌తో అక్క‌డిక‌క్క‌డే చాలా మంది  మరణించారు. మ‌రికొంత‌మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల ప్ర‌కారం ప్రాణనష్టం మ‌రింత పెరిగే అవ‌కాశ‌ముంది. 

ఎమిటి ఈ హాత్రాస్ సత్సంగ్ ?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో  ప్ర‌తియేటా ఈ హాత్రాస్ స‌త్సంగ్ ను ఇర్వ‌హిస్తారు. ఈ మ‌త‌ప‌ర‌మైన స‌మావేశానికి దేశంలోని చాలా ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో జ‌నాలు వ‌స్తారు. హత్రాస్ జిల్లా సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతిభాన్‌పుర్‌లో భోలే బాబా సత్సంగ్ శివారాధన కార్యక్రమం సంద‌ర్భంగా గంగాజ‌లం అందిస్తారు. ఈ జ‌లాన్ని తీసుకుంటే అన్ని రోగాలు న‌య‌మ‌వుతాయ‌నీ, కొత్త రోగాలు కూడా ద‌రిచేర‌వ‌ని ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు న‌మ్ముతారు. ఈ క్ర‌మంలోనే ఈ కార్య‌క్ర‌మానికి ల‌క్ష‌లాది మంది వ‌చ్చారు. ఈ స‌త్సంగ్ ను సౌరభ్ కుమార్ అని పిలిచే సాకర్ విశ్వ హరి భోలే బాబా నిర్వహిస్తున్నట్లు నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

ఈ ప్ర‌మాదం ఎలా జ‌రిగింది? 

హాత్రాస్ లో జ‌రిగిన ఈ తొక్కిస‌లాట‌లో ఇప్ప‌టివ‌ర‌కు 116 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి మ‌ర‌ణాలు పెరిగే అవ‌కాశ‌ముంది. ఈ ప్ర‌మాదం గురించి పోలీసులు చెబుతూ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం రద్దీ ఎక్కువ కార‌ణంగా తొక్కిసలాటకు దారితీసిందన్నారు. ఈ సమావేశం ప్రారంభానికి ముందు భారీ బారికెడ్లు అడ్డుపెట్టి ఎవరూ రాకుండా చూశారు. అయితే, ఒక్కసారిగి తెరవడంతో పెద్ద సంఖ్యలో జనాల మధ్య తొపులాట తొక్కిసలాటకు దారితీసిందని పలువురు పేర్కొంటున్నారు. అలాగే, అనుమతుల విషయంలో కూడా నిర్లక్ష్యం వుందనే పలువురు బాధితులు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు త‌మ‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం 116 మంది మ‌ర‌ణించార‌నీ, మ‌రో 18 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో అక్కడున్న బురదలో ఇరుక్కుపోయిన పరిస్థితులను ప్రత్యక్ష సాక్షులు గుర్తు చేసుకున్నారు. పలువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని చెప్పారు.  

ప్రధాని మోడీ దిగ్బ్రాంతి 

ఈ ప్ర‌మాదంపై ప్ర‌ధాని మోడీతో పాటు యూపీ సీఎం యోగి అదిత్య‌నాథ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై విచార‌ణ‌కు ఆదేశాంచారు. ఈ ప్ర‌మాదంపై ప్రాథమిక విచారణ కూడా జరుగుతోందని అలీఘర్ కమీషనర్ చైత్ర తెలిపారు. ఇప్ప‌టికే ప్రభుత్వం సహాయం కోసం రెండు హెల్ప్‌లైన్ నంబర్‌లు- 05722227041, 05722227042 ఏర్పాటు చేసిన‌ట్టు వివ‌రించారు. అలాగే, ఈ తొక్కిస‌లాట‌లో 116 మంది మరణించ‌గా, వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్ల‌లు ఉన్నారు. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ లోక్‌సభలో స‌త్సంగ్ లో ప్రాణాలు కోల్పోవడంపై సంతాపం తెలిపారు. బాధితుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌న్నారు. యోగి అదిత్య‌నాథ్ మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.50 వేలు చొప్పున పరిహారం ఇస్తామన్నారు.