సీఎం నివాసంలో ఉగాది సంబరాలు... సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన జగన్ దంపతులు

Mar 22, 2023, 12:12 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తాడేపల్లిలోని సీఎం నివాస ప్రాంగణంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో ఏర్పాటుచేసిన సెట్టింగ్ లో ఉగాది సంబరాలు జరిగాయి. ఇందులో జగన్-భారతి దంపతులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని పంచాంగ శ్రవణం విన్నారు. 

ఉగాది వేడుకలకు విచ్చేసిన సీఎం దంపతులకు చిన్నారులు మంగళహారతులు, పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భార్య భారతి నుదిటన జగన్ కుంకుమ పెట్టారు. అనంతరం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు సీఎం దంపతులు. రాబోయే సంవత్సరమంతా రాష్ట్రానికి, ప్రజలకు  మంచి జరగాలని  సీఎం ఆకాంక్షను వ్యక్తం  చేశారు.అనంతరం  నిర్వహించిన  సాంస్కృతిక  కార్యక్రమాలను  సీఎం దంపతులు వీక్షించారు.