మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ ప్రమాదం... చంద్రబాబు కుట్రలో భాగమే..: అడపా శేషు సంచలనం

Jan 17, 2023, 5:02 PM IST

 అమరావతి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్ కారు ప్రమాదంలో కుట్రకోణం దాగివుందంటూ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషగిరి సంచలన వ్యాఖ్యలు చేసారు. హత్యా రాజకీయాలు చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పెద్దిరెడ్డిపై కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఇందులో భాగంగానే నిన్న జరిగిన ప్రమాదం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని జరిగిందేమోనన్న అనుమానాలు వున్నాయంటూ శేషు సంచలన వ్యాఖ్యలు చేసారు. కాబట్టి అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం చెన్నముక్కపల్లె  రింగ్ రోడ్ పై మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి కాన్వాయ్ లోని కారు ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అడపా శేషు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.   చదువుకునే రోజులనుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేసేవాడని... ఇప్పుడు అలాగే చేస్తున్నాడని శేషు ఆరోపించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లకు ఎలాంటి హాని కలిగినా వైసిపి నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు... ఖబర్దార్ చంద్రబాబు అంటూ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ శేషె హెచ్చరించారు.