మీ పార్టీ వారినీ వదలరా?: మహిళా ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఫైర్

Feb 1, 2021, 3:42 PM IST

చిలకలూరిపేట నియోజకవర్గంలో అధికార వైసిపి దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో రమాదేవి విషయంలో ఈ విషయం వెల్లడైందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే విడదల రజినిపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. దౌర్జన్యాలు చేస్తుంది మీరే కదా అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగాన్ని కాదని సొంత రాజ్యాంగాన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

చిలకలూరిపేట మండలం లో వైఎస్ఆర్సిపి నాయకుడు సాంబయ్య భూములను లాక్కున్నారని... మైనింగ్ కోసం పేదల వద్ద లాక్కున్న భూముల విషయంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం మీకు తెలియదా? అని నిలదీశారు. మీ పార్టీ వాళ్ళను కూడా మీరు వదలరా? అని పత్తిపాటి ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయకపోతే ప్రజా వ్యతిరేకతతో వైసిపి కొట్టుకుపోతుందని... ప్రజలు భయపడకుండా నిష్పక్షపాతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రత్తిపాటి కోరారు.