
కరీంనగర్ : సోమవారం తెల్లవారుజామున కరీంనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో పెళ్లిషాపింగ్ చేసుకుని తిరిగి వెళుతున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ పట్టణంలోని అజ్మత్ పుర ప్రాంతానికి చెందిన సయ్యద్ రెహ్మాన్ కు పెళ్లి కుదిరింది. కొద్దిరోజుల్లో నిశ్చితార్థం వుండగా ఆ వెంటనే పెళ్లికూడా చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో ఆదివారం పెళ్ళికొడుకు రెహ్మాన్ తో పాటు కుటుంబసభ్యులు, బంధువులు షాపింగ్ కోసం హైదరాబాద్ కు వెళ్లారు. రోజంతా షాపింగ్ పూర్తిచేసుకుని రాత్రికి కారులో తిరిగి కరీంనగర్ పయనమయ్యారు.
అయితే సోమవారం తెల్లవారుజామున పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఎర్టిగా కారు ప్రమాదానికి గురయ్యింది. కరీంనగర్ ఆటోనగర్ సమీపంలో వేగంగా దూసుకెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారు గాల్లోకి ఎగిరి బోల్తా పడటంతో అందులోనివారు తీవ్రంగా గాయపడ్డారు.
మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం జరిగింది. కారులోని అందరూ తీవ్రంగా గాయపడగా స్థానికులు వారిని హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శభానా అంజుమ్(48) మృతిచెందింది. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్షమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం షభానా మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేసారు.