టీఆర్ఎస్లో అగ్రనేతలను దాటుకొని అనతికాలంలోనే కేటీఆర్ పార్టీలో అత్యున్నత పదవిని దక్కించుకొన్నారు
హైదరాబాద్: టీఆర్ఎస్లో అగ్రనేతలను దాటుకొని అనతికాలంలోనే కేటీఆర్ పార్టీలో అత్యున్నత పదవిని దక్కించుకొన్నారు. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో పార్టీలో తన కుటుంబసభ్యుల ప్రమేయం ఉండదని చెప్పిన కేసీఆర్ దానికి భిన్నంగా కేటీఆర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను అప్పగించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ తన పట్టును నిరూపించుకొన్నారు. ఈ క్రమంలోనే రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన మరునాడే కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ కేసీఆర్ నియమించారు.
టీడీపీకి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవికి రాజానామా చేసిన తర్వాత టీఆర్ఎస్ను 2001 ఏప్రిల్ 29వ తేదీన కేసీఆర్ ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన సమయంలో కేటీఆర్ కానీ, ఆయన కూతురు కవిత కానీ ఉద్యమంలో లేరు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సాగుతున్న సమయంలో కేటీఆర్ అమెరికాలో ఉన్నారు. కూతురు కూడ విదేశాల్లో ఉన్నారు.
ఈ విషయాన్ని ఉద్యమ సమయంలో పలు మార్లు కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2006 లో కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల సమయంలో కేటీఆర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో చేరారు. అప్పటివరకు హైద్రాబాద్లో ఉంటూ ఓ ఐటీ కంపెనీకి సౌత్ ఏషియా ఇంచార్జీగా కేటీఆర్ ఉండేవారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించకపోతే తెలంగాణ ఉద్యమం మరుగున పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణవాదులంతా ఆ సమయంలో కేసీఆర్ కు మద్దతుగా స్వచ్ఛంధంగానే కరీనంగర్కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఆనాడు ఉమ్మడి ఏపీ రాష్ట్ర సీఎంగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో కేసీఆర్ను ఓడించేందుకు తన శక్తియుక్తులను ఉపయోగించారు.
కరీంనగర్ జిల్లా నుండి రోడ్లు,భవనాల శాఖ మంత్రిగా ఉన్న జీవన్ రెడ్డిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థిగా ఎల్. రమణ, బీజేపీ అభ్యర్థిగా సిహెచ్ విద్యాసాగర్ రావు పోటీచేశారు. జీవన్ రెడ్డిపై కేసీఆర్ రెండులక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ విజయం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు.
ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయాన్ని ఆ సమయంలో కేటీఆర్ కేసీఆర్ కు చెప్పలేదు.ఈ విషయాన్ని కేటీఆర్ అప్పుడప్పుడూ ప్రస్తావిస్తుంటారు. అప్పటి నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేటీఆర్ పాల్గొంటున్నారు.
2009 ఎన్నికల్లో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేటీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో విజయం సాధించారు. సిరిసిల్ల నుండి టీఆర్ఎస్ ఇంచార్జీగా ఉన్నకేకే మహేందర్ రెడ్డి స్థానంలో కేటీఆర్ ను బరిలోకి దింపడంతో కేకే మహేందర్ రెడ్డి రెబెల్గా బరిలోకి దిగారు.
2006 కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల నుండి పార్టీ కార్యక్రమాల్లో కేటీఆర్ చురకుగా పాల్గొంటున్నారు. కేసీఆర్ తనయుడిగా కేటీఆర్కు పార్టీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అదే సమయంలో కేటీఆర్ వాగ్దాటి ప్రత్యర్థుల వ్యూహలకు చెక్ పెట్టేలా ప్లాన్ చేయడం ఆయనకు కలిసిచ్చింది.
2009 ఎన్నికల్లో సిరిసిల్ల స్థానం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత అసెంబ్లీ లోపల, వెలుపల కూడ కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్రను పోషించారు. ఇదే సమయంలో పార్టీపై క్రమంగా పట్టు పెంచుకొనేందుకు కేటీఆర్ ప్రయత్నాలు చేశారు.ఈ ప్రయత్నాలకు పరోక్షంగా కేసీఆర్ కూడ సహాయసహకారాలు అందించారనే ప్రచారం కూడ లేకపోలేదని రాజకీయపరిశీలకులు అభిప్రాయంతో ఉన్నారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకొంది. టీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకొన్న తర్వాత ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్కు బాధ్యతలను అప్పగించారు కేసీఆర్.
తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేలా కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ నేతలను కలుసకొనే సమయం ఎక్కువగా ఉండేది కాదు.
కేసీఆర్ తన మకాన్ని సీఎంగా ప్రగతి భవన్కు మార్చడంతో గతంలో కేసీఆర్ నివాసం ఉన్న భవనం వద్ద ప్రతి రోజూ కేటీఆర్ పార్టీ నేతలతో చర్చించేవారు. ఇలా పార్టీ నేతలకు కేటీఆర్ మరింత దగ్గరయ్యారు. పార్టీపై కూడ కేటీఆర్ పట్టును పెంచుకొన్నారు. అదే సమయంలో మంత్రిగా పాలనపరంగా కూడ పట్టును సాధించారు.
ఇదిలా ఉంటే జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించారు కేసీఆర్. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక నుండి ప్రతి విషయం కేటీఆర్ కనుసన్నల్లో సాగింది.
ఈ ఎన్నికల్లో వంద సీట్లను గెలుచుకొంటామని కేటీఆర్ విపక్షాలకు సవాల్ విసిరారు. ఈ సవాల్కు తగ్గట్టుగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 కార్పోరేటర్లను కైవసం చేసుకొంది.జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేటీఆర్ కు మున్సిఫల్ శాఖను అప్పగించారు హరీష్రావు వద్ద ఉన్న మైనింగ్ శాఖను కూడ కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో ప్రచార బాధ్యతలను కేటీఆర్ చూసుకొన్నారు. పీపుల్స్ ఫ్రంట్కు గ్రేటర్ హైద్రాబాద్ లో ఎక్కువ సీట్లు వస్తాయని భావించినా.. అందుకు విరుద్దంగా ఫలితాలు వచ్చాయి.
అంతేకాదు టిక్కెట్లు దక్కని అసంతృప్తులకు బుజ్జగింపులు, పార్టీ టిక్కెట్ల కేటాయింపు విషయంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. నామినేటేడ్ పదవుల విషయంలో చాలా మంది నేతలు కేటీఆర్ను కలిసేవారు.
కూటమికి వ్యూహలకు చెక్ పెట్టేలా కేటీఆర్ ప్లాన్ టీఆర్ఎస్ కు కలిసొచ్చింది. జీహెచ్ఎంసీ తరహలోనే గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో టీఆర్ఎస్ అత్యధిక స్థానాలను గెలుచుకొంది. రెండో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మరునాడే కేసీఆర్ .. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు అప్పగించారు.
టీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరొందిన హరీష్రావును అధిగమిస్తూ కేటీఆర్ పార్టీపై పట్టును సాధించారు. హరీష్, కేటీఆర్ వర్గాలు పార్టీలో ఉన్నాయని ప్రచారంలో ఉంది. అయితే ఎన్నికలకు ముందు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని హరీష్ రావు, కేటీఆర్ ప్రకటించారు.
పార్టీలో తన సోదరి కవిత కూడ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.2014 ఎన్నికల్లో నిజామాబాద్ నుండి కవిత ఎంపీగా విజయం సాధించారు. అంతకు ముందు బతుకమ్మ సంబరాల పేరుతో కవిత తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ జాగృతి పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. హరీష్ రావు, కవితలను దాటుకొని కేటీఆర్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకొన్నారు.
సంబంధిత వార్తలు
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణ భవన్కు కేటీఆర్
కేటీఆర్తో కలిసి పనిచేస్తా: హరీష్ రావు (వీడియో)
హరీష్ అభినందనలు: థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై
కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..
కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...
పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్
కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..