
నిరనస గళాల అడ్డాగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా పనిచేసిన ధర్నా చౌకను సర్కారు ఎత్తేస్తుండటంపై ప్రజా సంఘాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే.
ముఖ్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ దీనిపై పెద్ద పోరాటానికే దిగుతోంది. తనతో కలిసివచ్చే పార్టీలను, ప్రజాసంఘాల నేతలను సమీకరిస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కితీసుకొనేలా ఒత్తిడి తెస్తోంది.
నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ కు దగ్గర్లో ఉండటం వల్ల ఇంరిరాపార్కు ధర్నా చౌక్ వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయని ప్రభుత్వం సాకుగా చూపుతోంది.
అయితే ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సర్కారు చూపుతున్న సాకుపై మండిపడుతున్నారు.
ప్రజాస్వామ్య హక్కులను కాలరాచే ప్రక్రియకు గులాబీ సర్కారు నాందిపలికిందని అందులో భాగమే ధర్నా చౌక్ తరలింపు అని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి.
ఇటీవల పవన్ కల్యాణ్ కూడా ధర్నా చౌక తరలింపు సరికాదని పేర్కొన్నారు. ప్రజాసంఘాలు ధర్నా చౌక్ తరలింపుపై చేస్తున్న నిరసనకు తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు.
ఇలా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, వివిధ యూనియన్ల నేతలు ధర్నా చౌక్ తరలింపుపై మండిపడుతోంటే కొందరు మాత్రం ధర్నౌ చౌక్ తరలింపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లకు సీఎం కేసీఆర్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని కొనియాడుతున్నారు.
ఇంతకీ వారేవరంటే... ధర్నా చౌక్ సమీపంలోని ఎన్టీయార్ స్టేడియంలో, ఇందిరా పార్కులో వాకింగ్ చేసే వయో వృద్ధులు.పాపం, వీరికి... ధర్నా చౌక్ లో కడుపుకాలి గొంతెత్తుతున్న వారి వల్ల తీవ్ర అసౌకర్యం చోటు చేసుకుంటోందట.
ఎవరైనా ధర్నా చౌక్ లో టెంట్ లు వేసి కూర్చుంటే తమకు వాకింగ్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతోందని, తమ కార్లు పార్కింగ్ చేసుకోడానికి సరైన స్థలం కూడా దొరకడం లేదని ఆ వాకర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల తమకు ఇకపై ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ధర్నాచౌక్ తరలింపుపై కోదండరాం, పవన్ కల్యాణ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై వారు మండిపడ్డారు. తాము వాకింగ్ చేసుకోడానికి ఇదే సరైన స్థలమని , ధర్నాలు ఎక్కడైనా చేసుకోవచ్చని సలహా ఇచ్చారు.