మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోవాగ్జిన్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు.
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న కేంద్ర మంత్రి కోవాగ్జిన్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు. ఈ కర్యక్రమంలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కిషన్ రెడ్డి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా సోమవారం నుంచి 2 విడత ఉచిత వ్యాక్సిన్ ను ప్రారంభించామన్నారు. వ్యాక్సిన్ పై ప్రజల్లో భరోసా కల్పించేందుకు నిన్ననే ప్రధాని మోడీ కూడా టీకా తీసుకున్నారన్నారు. కాబట్టి ప్రజలందరూ భయపడకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
read more కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మోడీ.. దాని వెనక అసలు రహస్యం ఇదే
''తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 91 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇవ్వబడుతుంది. వ్యాక్సిన్ తీసుకున్నా తగిన జాగ్రత్తలు అందరూ పాటించాలి లేకపోతే ఇంట్లో వాళ్లకి ప్రాబ్లమ్ అవుతుంది. ఏడాది క్రితం ఈరోజే గాంధీకి మొట్టమొదటి కరోనా పేషెంట్ వచ్చిన రోజు... ప్రాణాలకు తెగించి ఏడాదికాలంగా గాంధీ ఆసుపత్రి కోవిడ్ చికిత్స అందిస్తుంది...అందుకు ధన్యవాదాలు'' అని తెలిపారు.
''దేశవ్యాప్తంగా 10,000 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నాం. వ్యాక్సిన్ ప్రొడక్షన్ బట్టి త్వరలోనే 20 వేలకు పెంచుతాం. ప్రైవేట్ ఆస్పత్రిలు వ్యాక్సిన్ కోసం రూ.250 కి మించి వసూలు చేయరాదు'' అని కేంద్ర మంత్రి సూచించారు.