
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం మోపింది. దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ చార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు నుంచే పెరిగిన టోల్ చార్జీలు అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీఎస్ఆర్టీసీ కూడా టోల్ భారాన్ని ప్రయాణికులపైనే మోపేందుకు సిద్దమైంది. కేంద్రం పెంచిన టోల్ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో టికెట్ ధరలు పెరగడంతో.. టోల్ ప్లాజాల గుండా వెళ్లే టీఎస్ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.
గరుడ ప్లస్ బస్సుల నుంచి ఆర్డినరీ బస్సుల వరకు.. టికెట్ టికెట్ ధరలు పెరిగాయి. గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్పై 4 రూపాయలు పెంచారు. అలాగే ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున టోల్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. నేటి నుంచే పెరిగిన టికెట్ ధరలు అమల్లోకి రానున్నాయి.