
నిజామాబాద్లో ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరుకుంది. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు హామీని ప్రస్తావిస్తూ పసుపు రంగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. పసుపు రంగులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ‘ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు’ అని రాసి ఉంచారు. ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ద్వారా నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్పై విమర్శలు గుప్పించారు. అయితే జిల్లాలో ఫ్లెక్సీలు, హోర్డింగ్లను పసుపు రైతులు చేసినట్టుగా చెబుతున్నప్పటికీ.. ఆ ఆలోచన వెనుక బీఆర్ఎస్ కార్యకర్తల హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది.
అయితే నిన్న పసుపు బోర్డు ఫ్లెక్సీలు కట్టిన చోట పోటీగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలను ఇందులో ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. వంటి హామీల గురించి ప్రశ్నించారు. ప్రజలను ఉచితాలను అలవాటు చేస్తున్నారని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. అయితే కొన్ని చోట్ల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు.
ఇదిలా ఉంటే.. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చారు. గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డును తీసుకొచ్చేలా కృషి చేస్తానని అరవింద్ బాండ్ పేపర్పై సంతకం చేశారు. అయితే నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు. స్పైసెస్ బోర్డు శాఖను అప్గ్రేడ్ చేశారు. ఇక, అరవింద్ ఇచ్చిన హామీపై ఎమ్మెల్సీ కవిత ప్రశ్నిస్తూనే ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడంలో అరవింద్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
ఇక, దేశంలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ బుధవారం పార్లమెంటులో చెప్పడంతో పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి.