
తెలంగాణ రాజకీయ జేఏసీ రేపు నిర్వహించతలపెట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు.
అనుమతి లేని ర్యాలీలో పాల్గొంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు, విద్యార్థుల ఈ ర్యాలీలో పాల్గొంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇందిరా పార్కు వద్దకు ఎవరినీ రావద్దని సూచించారు.
ర్యాలీలో అసాంఘీక శక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాల నుంచి కూడా అదనంగా పోలీసులను రప్పించి ఇందిరా పార్కు ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పారు.
కాగా, ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా రేపు ఉదయం 10 గంటలకు నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం స్పష్టం చేశారు.
తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో రేపు నిర్వహించతలపెట్టిన ర్యాలీ అనుకున్న ప్రకారం చేసి తీరుతామని టీ జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. ఎవరు బెదిరించినా వెనక్కి తగ్గేది లేదన్నారు.
ఉద్యమసమయంలో నాతో పాటు సీఎం కేసీఆర్ పై కూడా అనేక కేసులు ఉన్నాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని పోలీసులు హింసాత్మకంగా చిత్రీకరించడం దారుణమన్నారు.
ర్యాలీకి వచ్చే వాళ్లను అరెస్టు చేస్తే అక్కడే శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు.
నిన్నటి నుంచే టీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, ఇప్పటి వరకు 600 మందిని అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలోప్రజాస్వామ్య పాలన కనిపించడం లేదని వాపోయారు.
ముందుగా అనుకున్న ప్రకారమే ఇందిరా పార్కు నుంచి సుందరయ్య భవన్ వరకు ర్యాలీని నిర్వహించితీరుతామని నిరుద్యోగులు వారి ప్రణాళిక ప్రకారమే ర్యాలీకి చేరుకుంటారని తెలిపారు.
ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా తెలంగాణ ఉద్యమాన్నే పోలీసులు తప్పుపడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తోందన్నారు.
ఎవరికి తెలియన నాగోలు మెట్రో స్థలంలో సభ నిర్వహించుకోమని కోర్టు చెప్పడం తమకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని అన్నారు.
విద్యార్థులకు ర్యాలీకి ఎలా తరలిరావాలో తెలుసునని, వారి ప్రణాళికలు వారికి ఉన్నాయని స్పష్టం చేశారు.