అర్ధరాత్రి మహిళ ఇంట్లోకి ప్రవేశించిన టిఆర్ఎస్ నేత.. బీర్ సీసాతో దాడి..

By Bukka SumabalaFirst Published Sep 20, 2022, 10:46 AM IST
Highlights

టీఆర్ఎస్ నేత ఓ మహిళతో ఫ్రెండ్షిప్ చేసి, చాటింగ్ చేశాడు. ఆమెతో కలిసి అర్థరాత్రి ఆమె ఇంట్లో బీరు తాగాడు. ఆ తరువాత మాటా మాటా పెరిగి ఆమె గొంతుకోసి పారిపోయాడు. 

హైదరాబాద్ : అర్ధరాత్రి దాటాక ఇంట్లోకి ప్రవేశించిన ఓ టిఆర్ఎస్ నాయకుడు మహిళపై బీర్ సీసాతో దాడి చేయడం హైదరాబాద్ లో కలకలం రేపింది. నిందితుడు అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ప్రతి పక్షాలు ఆందోళనకు దిగాయి. నాటకీయ పక్కీలో జరిగిన ఘటన వెనుక కారణాలను వెలికితీసేందుకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ పరిధిలోని ఎం.ఎస్. మక్తాలో నిషాగౌడ్ (31) భర్తతో కలసి నివసిస్తుంది. ఏడాది క్రితం ఆమెకు ఫేస్బుక్లో పరిచయమైన బోరబండ డివిజన్ టిఆర్ఎస్ సమన్వయకర్త  విజయసింహారెడ్డి(33)తో ఫోన్ లో చాటింగ్ చేస్తూ ఉండేది.

భర్తలేని సమయంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక అతను ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. మాటా మాటా పెరగడంతో పట్టరాని కోపంతో అతడు బీరుసీసా పగలగొట్టి ఆమె గొంతుకోసి పారిపోయాడు. డయల్ 100కు అందిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. తనపై విజయ సింహారెడ్డి దాడి చేసినట్లు ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

వికారాబాద్ జిల్లాలో వృద్ద దంపతులపై టీఆర్ఎస్ నేత దాడి: న్యాయం చేయాలని బాధితుల డిమాండ్

ప్రతిపక్షాలు ఆందోళన..
- నిందితుడిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నేతలు సోమవారం పంజాగుట్ట ఠాణా ఎదుట ఆందోళనకు దిగారు. బిజెపి ఖైరతాబాద్ ఇన్చార్జి పల్లపు గోవర్ధన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గౌతంరావు కార్యకర్తలతో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. 

- నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వరలక్ష్మి కార్యకర్తలతో నిరసనకు దిగారు.

కుట్ర చేసి ఇరికించారు…
- మహిళపై దాడి జరిగిన సమయంలో తాను వినాయకనగర్ లోని తన ఇంట్లో ఉన్నట్లు విజయసింహారెడ్డి మీడియాతో తెలిపారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫక్రుద్దీన్ కుట్రపూరితంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు.

- తనపై విజయసింహారెడ్డి చేసినవని నిరాధార ఆరోపణలు అని కార్పోరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఖండించారు. 

- ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక నిషా సెల్ఫీ వీడియో విడుదల చేసింది. పోలీసు శాఖ పై తనకు నమ్మకం ఉందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తే బీజేపీ నాయకులను కలిసి న్యాయం చేయమని అడుగుతానని పేర్కొన్నారు. 

click me!