సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన జక్కుల బాబు దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నక్సలైట్ గా మారాడు.
సిరిసిల్ల: సిరిసిల్ల రాజన్న జిల్లాకు చెందిన జక్కుల బాబు దుబాయ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత నక్సలైట్ గా మారాడు. భార్యపై ప్రతీకారం తీర్చుకొనేందుకు బాబు నక్సలైట్గా మారినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
2016లో బాబు దుబాయ్ నుండి సిరిసిల్లకు తిరిగి వచ్చాడు. దుబాయ్లో బాబు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడు. దుబాయ్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ సంపాదించిన డబ్బును ఆయన తన భార్యకు పంపేవాడు.
అయితే దుబాయ్ లో బాబు కష్టపడి పంపిన డబ్బును భార్య తన ప్రియుడి కోసం ఖర్చు చేసింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భార్య పారిపోయింది. దీంతో భార్యపై ప్రతీకారం తీర్చుకొనేందుకు గాను బాబు జనశక్తి నక్సలైటుగా మారాడు.
జనశక్తి నక్సలైటుగా చెప్పుకొంటూ డబ్బులు వసూలు చేసేవాడు. నీటిపారుదల కాంట్రాక్టర్ల నుండి డబ్బులు వసూలు చేసేవాడు. దీంతో 2017 అక్టోబర్ 6వ తేదీన బాబుతో పాటు ఆయన సహాయకుడు తోకల శ్రీకాంత్పై పోలీసులు కేసు నమోదుచేశారు.
బాబుది చిన్నలింగాపూర్ గ్రామం. జనశక్తి జిల్లా కమిటీ కార్యదర్శిగా బాబును పార్టీ ప్రమోట్ చేసింది. ఇటీవలనే బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి రూ.44,600 నగదు, అమెరికాలో తయారైన ఓ తుపాకీ, 15 బుల్లెట్లను స్వాధీనం చేసుకొన్నారు.
జనశక్తి నేత కూర రాజన్న జనశక్తి గ్రూపులను ఐక్యం చేసే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. బాబుపై 2011 నుండి తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది.
2001 నుండి 2008 వరకు బాబుపై పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇల్లంతకుంట పోలీస్స్టేషన్తో పాటు నిజామాబాద్ పోలీస్ స్టేషన్లో కూడ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు.
సంబంధిత వార్తలు
కేటిఆర్ పై జనశక్తి నక్సలైట్ల రెక్కీ?