బంగాళాఖాతంలో అల్పపీడనం... మూడురోజుల్లో తెలంగాణకు తిరిగిరానున్న భారీ వర్షాలు

By Arun Kumar PFirst Published Sep 10, 2021, 9:38 AM IST
Highlights

తెలంగాణలో సెప్టెంబర్ 13నుండి మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు తెలంగాణలో భీభత్సాన్ని సృష్టించాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలతో జలాశయాలు, చెరువులు నిండు కుండల్లా మారి నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించి పలు పట్టణాలు, గ్రామాలను ముంచెత్తాయి. ఈ వర్షాలు సృష్టించిన భయానక పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే భయటపడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. ఈ నెల 13నుండి మళ్లీ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

సెప్టెంబర్ 11న ఉత్తర,మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ అల్పపీడనం 13వ తేదీ నాటికి బలపడనుందని... దీని ప్రభావంతో తెలంగాణలో తిరిగి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపారు. 

ప్రస్తుతం తెలంగాణలో పశ్చిమ దిశ నుండి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

read more  పశ్చిమ గోదావరి: గోదారి ఉగ్రరూపం.. ఏజెన్సీల్లో ముంపు భయం, 40 గ్రామాలకు రాకపోకలు కట్

గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షాల కారణంగా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లోకి చేరి జలమయమయ్యాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ , ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వాగులు, వంకలు, చెరువులు అలుగు పోస్తుండడంతో చాలా చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు మరణించారు. వరంగల్-కరీంనగర్ జాతీయ రహదారిపై వరంగల్-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్ చెరువు వద్ద వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు వాగు, ఆలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్, వరంగల్ నగరాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్ లోని హంటర్ రోర్డు, ఎన్టీఆర్ నగర్, సంతోషిమాత కాలనీ, సాయి నగర్ తో పాటు 10 కాలనీలు నీటిలోనే ఉన్నాయి. కరీంనగర్ లో 15 కాలనీల్లో వరద నీరు చేరింది.సిరిసిల్ల, వేములవాడ పట్టణాలను వరద ముంచెత్తింది. కోరుట్ల, జగిత్యాల, మెట్‌పల్లి, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంటతో పాటు నిజామాబాద్ జిల్లాలోని పలు కాలనీలు వరదలోనే ఉన్నాయి.

నిర్మల్ లోని పలు కాలనీల్లో వరద ముంచెత్తింది. వినాయకనగర్, రాహుల్ నగర్, గోవింద్ నగర్  తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది.కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం మహ్మద్‌నగర్ మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోయింది. కరీంనగర్ మండంలో ఎలబోతారం, ముగ్థుంపూర్ చెక్ డ్యామ్ ల కట్టలు తెగిపోయాయి.నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మంలం చింతలూరులోని కోళ్ల ఫారంలో 5 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో సింగూరు నది ప్రవాహంతో ఏడుపాయల ఏడుపాయల దుర్గాభవాని ఆలయాన్ని మూసివేశారు. ఆలయం చుట్టూ  నది ప్రవాహం ముంచెత్తింది. 

 

click me!