
EV charging points : దేశంలో రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల అవసరాలకు అనుకునంగా.. కంపెనీలు కూడా సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారీ చేసి మార్కెట్లోకి వదులుతున్నాయి. ఇప్పటికే దేశ మార్కెట్లలో ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహిస్తోన్నాయి.
ఈ క్రమంలో ఇ-వాహనాలు వాడుతున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TSSPDCL) మరియు తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TSREDCO) లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోన్నాయి.
ఇప్పటికే పలు సబ్ స్టేషన్లలో తగినంత స్థలం ఉన్నందున ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయలని టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఆర్ఈడీసీవోలు ప్రణాళికలు సిద్దం చేస్తోన్నాయి. ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఇంకా సిద్ధం కానప్పటికీ, ఈ-వాహన యాజమానుల నుండి పెరుగుతున్న డిమాండ్ దృష్టి లో పెట్టుకొని వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.
TSSPDCL మరియు TSREDCO అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలపై చర్చించారని, అయితే ప్రక్రియను వేగవంతం చేయడానికి బ్లూప్రింట్ను సిద్ధం చేయాల్సి ఉందని వర్గాలు తెలిపాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 415 సబ్ స్టేషన్లలోని మిగులు స్థలాన్ని ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఉపయోగించుకోవచ్చని అధికారి తెలిపారు. అలాగే.. హైవేలపై సులభంగా 20 వాహనాలకు ఒకేసారి వసతి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో కేంద్రం దేశంలోని 68 నగరాల్లో 2,877 ఈ-వాహన ఛార్జింగ్ స్టేషన్లను మంజూరు చేసింది.
అలాగే... హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ (ఫేమ్ ఇండియా) పథకం యొక్క ఫేజ్-II కింద తొమ్మిది ఎక్స్ప్రెస్వేలు మరియు 16 హైవేలలో 1,576 ఛార్జింగ్ స్టేషన్లు మంజూరు చేయబడ్డాయి. ఇంక ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి మంత్రిత్వ శాఖ రూ.1,000 కోట్లు కేటాయించింది. నవంబర్ 8, 2021 నాటికి, తెలంగాణలో 136 ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో ప్రస్తుతం 9,000 కంటే ఎక్కువ ఇ- బైక్లు మరియు కార్లు వినియోగంలో ఉన్నట్టు తెలుస్తోంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్లలో వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. TSREDCO ప్రాజెక్ట్ డైరెక్టర్ DV రామకృష్ణ కుమార్ సబ్ స్టేషన్లలో ఛార్జింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ధృవీకరించారు.