
Telangana police: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సేవలు మరింత సులభంగా మారాయి. ఇదే క్రమంలోనే టెక్నాలజీని తప్పుడు పనులకు ఉపయోగించడం కూడా క్రమంగా పెరుగుతోంది. ఆన్లైన్ మోసాలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన లోన్ యాప్ మోసాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. లోన్ యాప్ ల మాయలో పడొద్దని సూచిస్తున్నారు. లోన్ యాప్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
లోన్ యాప్స్ మోసాల గురించి హెచ్చరిస్తూ పోలీసులు జారీ చేసిన ఓ ప్రకటనలో.. "చాలా యాప్లు ఫోన్ ద్వారా రుణాలను అందిస్తాయి. అవసరమైన వ్యక్తులు వారి పరిచయాలను యాక్సెస్ చేయడానికి అనుమతులను అనుమతించడం ద్వారా అంగీకరిస్తారు. వారు (కంపెనీ) అధిక వడ్డీ రేటును వసూలు చేస్తారు, ఎవరైనా తిరిగి చెల్లించడంలో విఫలమైతే/ఆలస్యం చేస్తే, వారు తమ కాంటాక్ట్లందరినీ సంప్రదించడం/మెసేజ్ చేయడం ద్వారా వేధించడం ప్రారంభిస్తారు" అని పేర్కొంది. ఈ క్రమంలోనే లోన్ యాప్స్ నుంచి రుణాలు తీసుకున్నవారిని వేధింపులకు గురిచేయడంతో పాటు భయపెడుతూ.. అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నారని హెచ్చిరించారు. ఇలాంటి వాటిపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
గూగుల్ ప్లేలో స్టోర్ లో పెద్ద మొత్తంలో నకిలీ లోన్ యాప్స్ ఉన్నాయని తెలంగాణ పోలీసులు వెల్లడించారు. గూగుల్ ప్లేలో అందుబాటులో ఉన్న 100కి పైగా నకిలీ రుణాల యాప్ల పేర్లను కూడా పోలీసులు విడుదల చేశారు. తెలంగాణ పోలీసులు ఇటీవలి నెలల్లో లోన్ యాప్ వ్యాపారాన్ని అక్రమంగా నడుపుతున్న పలు కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. నకిలీ వ్యాపారాన్ని నడుపుతున్న వారిపై కేసులు నమోదుచేశారు. లోన్ యాప్స్ మోసాలతో వ్యాపారాన్ని నిర్వహించడంలో కీలకంగా ఉన్న చాలా మంది వ్యక్తులను అరెస్టు చేశారు. లోన్ యాప్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ల బారిన పడి తెలంగాణలో కొంతమంది వ్యక్తులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
అయితే, లోన్ యాప్స్ నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం.. అరెస్టు చేయడం.. వారికి శిక్షలు పడటం జరుగుతోంది. అయితే, మరో కొత్త పేరుతో ఇంకో లోన్ యాప్ పుట్టుకురావడం.. మళ్లీ ఇదే దందా కొనసాగడం ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి. ఇటీవల బాధితుల నుండి ఫిర్యాదుల మేరకు పోలీసులు మరికొన్ని కేసులు నమోదు చేశారు. గత నెల రోజుల వ్యవధిలో ఆన్ లైన్ లోన్ యాప్ లపై 50 కేసులు నమోదయ్యాయని సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ చెప్పారు.2020-21 లో ఆన్ లైన్ లోన్ యాప్ పై 28 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొంత కాలంగా స్ధబ్దుగా ఉన్న ఆన్ లైన్ లోన్ యాప్ సంస్థలు తిరిగి తమ కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, ఢిల్లీలలో కాల్ సెంటర్లను ఏర్పాటు చేశారని పోలీసులు గుర్తించారు.ఈ సెంటర్లపై దాడులు చేస్తామని పోలీసులు తెలిపారు. ఆన్ లైన్ లోన్ యాప్ లను చైనా కు చెందిన కంపెనీలు నిర్వహిస్తున్నాయని పోలీసులు గుర్తించారు.