తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు : 93 మందికి ఓటేసిన వ్యక్తి.. !!

By AN TeluguFirst Published Mar 15, 2021, 12:57 PM IST
Highlights

తెలంగాణలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 93మందికి ఓటు వేశాడు. ఈ వింత ఘటన సైదాబాద్ లో చోటు చేసుకుంది. 

తెలంగాణలో ఆదివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా 93మందికి ఓటు వేశాడు. ఈ వింత ఘటన సైదాబాద్ లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. ఐఎస్ సదన్ డివిజన్ సుబ్రమణ్యంనగర్ కాలనీలోని పద్మావతి కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు బూత్ లోకి వెళ్లిన ఓ ఓటరు 20 నిమిషాలు గడిపారు. దీంతో క్యూ లైన్లో ఉన్న మిగతా ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. 

ఓటు వేయడానికి ఇంత సేపు ఎందుకంటే బైటికి వచ్చిన వ్యక్తిని అధికారులు, ఓటర్లు ప్రశ్నించగా తాను 93మందికి ఓటు వేశానని అందుకే లేటయ్యిందని చెప్పడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. 

మరోవైపు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్‌- రంగారెడ్డి - మహబూబ్‌నగర్‌, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. 4 గంటలలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని ఎన్నికల కమీషన్ తెలిపింది. 

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టీఆర్ఎస్ తరఫున సురభి వాణీదేవి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, కాంగ్రెస్‌ తరఫున చిన్నారెడ్డితో పాటు స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మధ్య గట్టి పోటీ నడిచింది. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 39.09 శాతం పోలింగ్‌ నమోదైంది.  

ఇక నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో టీఆర్ఎస్ తరఫున పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి సుగ్గు ప్రేమేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున రాములు నాయక్‌, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమరెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఇక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు 43.46 శాతం పోలింగ్‌ నమోదైంది.  

click me!