KTR: నేడు విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

Published : Mar 23, 2022, 11:59 PM IST
KTR: నేడు విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే:  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్

సారాంశం

KTR: తెలంగాణ రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులు తీసుక‌రావాల‌నే  ధ్యేయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి  కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు వారాల అమెరికా పర్య‌ట‌న‌లో భాగంగా ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ బృందం కలిసింది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయం సాధించిన రాష్ట్రం తెలంగాణ నేన‌ని,  అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు.   

KTR: స్వతంత్ర భారతదేశంలో అత్యంత విజయం సాధించిన రాష్ట్రం తెలంగాణ నేన‌ని,  అవమానాలు, అవహేళనలు, అడ్డంకులను పట్టుదల, క్రమశిక్షణతో అధిగమించి తెలంగాణ సాగిస్తున్న ప్రస్థానాన్ని ప్రపంచమే అబ్బురంగా చూస్తుందన్నారు మంత్రి కే తారకరామారావు. ఈ విజయగాథలో భాగం పంచుకోవాలని ఎన్.ఆర్.ఐలను మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి  కేటీఆర్, మిలిపిటాస్‌లోని ఇండియన్ కల్చరల్ సెంటర్‌లో ప్రవాస భారతీయులు నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... “ఏడేండ్ల క్రితమే.. పసికూన లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీకు పరిచయం చేశాను. ఏడేండ్ల తరువాత అన్ని రంగాల్లో విజేతగా నిలిచిన తెలంగాణ సక్సెస్ స్టోరీని చెప్పడానికి మళ్లీ వచ్చాను. ఇందుకు సంతోషంగా, గర్వంగా ఉంది”  అని అన్నారు.               2014 లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎన్.ఆర్.ఐలకు వివరించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం ఒక లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ ఏడేండ్లలో అది 130% పెరిగి రెండు లక్షల డెబ్బై-వేల రూపాయలుగా ఉందన్నారు.ఇక నాడు రాష్ట్ర GSDP 4.9 లక్షల కోట్ల రూపాయలైతే నేడు నేడు 11.54 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు కేటీఆర్. భౌగోళికంగా దేశంలో తెలంగాణ 11 వ అతిపెద్ద రాష్ట్రం, జనాభాపరంగా 12 వ అతిపెద్ద రాష్ట్రం. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఇవాళ భారతదేశ ఆర్థిక వృద్ధిలో 4 వ అతిపెద్ద వాటాదారు తెలంగాణ అని మంత్రి కేటీఆర్ చెప్పారు.  అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న తెలంగాణ,  దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు  సపోర్ట్ గా నిలుస్తోందన్నారు. ఎవరూ ఊహించని విధంగా కరెంట్ సమస్యను పరిష్కరించి దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దిక్సూచీలా నిలిచారన్నారు కేటీఆర్. కేవలం ఏడేండ్లలోనే మన స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెండింతలు కావడం తెలంగాణ ప్రబలశక్తికి నిదర్శనమన్నారు. 

పర్యావరణ హితంగా తెలంగాణ లో అభివృద్థి జరుగుతోందన్న  కేటీఆర్,  రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం విద్యుత్ లో 15 శాతం వాటా పునరుత్పాదక వనరులదే అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 40 మెగావాట్లగా ఉన్న స్థాపిత సౌర విద్యుత్ సామర్థ్యం ఇవాళ 5000 మెగావాట్లకు చేరిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు కేటీఆర్. ఇక పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.

కాళేశ్వ‌రం గురించి..                                    

దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతీ ఇంటికి ఉపరితర నీటి వనరులతో శుద్దిచేసిన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని కేటీఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనకు ఇవన్నీ కేవలం మచ్చుతునకలే అన్నారు.  కేవలం 4 సంవత్సరాల్లోనే కాళేశ్వరంలాంటి భారీ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తెలంగాణ సత్తాను ప్రపంచానికి చూపించిన నాయకత్వం కేవలం తెలంగాణ సొంతమన్నారు కేటీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో  తెలంగాణలో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అపరభగీరథుడిలా ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితంగా దేశానికే ధాన్యాగారంలా తెలంగాణ మారిందన్నారు. ఇవాళ తెలంగాణలో పండిన పంటను కొనలేమని భారత ఆహార సంస్థ చేతులెత్తేసిందని కేటీఆర్ గుర్తుచేశారు. 

 టీఎస్ ఐపాస్ లాంటి వినూత్న విప్లవాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత తెలంగాణదే అన్నారు మంత్రి కేటీఆర్. కేవలం 21 రోజుల్లో పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను ఇస్తున్నామన్నారు. "మేము 19,000 కంటే ఎక్కువ పరిశ్రమలకు అనుమతులివ్వడంతో 2.3 లక్షల కోట్ల రూపాయాలు పెట్టుబడులు వచ్చాయి. టీఎస్ ఐపాస్ చట్టంతో ఇప్పటివరకు సుమారు 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలిపారు. 

         ఇవాళ వైద్య రంగంలో ఎవరూ ఊహించని విధంగా మౌలిక వసతుల కల్పన తెలంగాణలో జరుగుతోందన్న మంత్రి కేటీఆర్, గతంలో 3 వైద్య కళాశాలలు మాత్రమే ఉంటే ఈ ఏడేండ్లలో రాష్ట్రంలో 10 కొత్త  వైద్య కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే 20 కొత్త మెడికల్ కాలేజీలు తెలంగాణలో ఏర్పాటవుతాయని కేటీఆర్ చెప్పారు. ఐటీ అంటే కేవలం హైటెక్ సిటీ అనే భావనను తమ ప్రభుత్వం మారుస్తోందన్నారు కేటీఆర్. హైదరాబాద్ నలుమూలలతో పాటు తెలంగాణలోని ఇతర పట్టణాలకు కూడా ఐటీని విస్తరిస్తున్నామన్నారు. 

         ఈ కార్యక్రమంలో మన ఊరు-మన బడి పోర్టల్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యారంగంలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామన్నారు. “పుట్టిన గడ్డకు ఏదైనా చేయాలనే అలోచన మీలో ఉంటే తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో మీ ఊరి బడిని దత్తత తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయండి” అన్నారు

తెలంగాణ విజయగాథలో భాగం కావాలనుకనే ప్రవాసీయులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలన్నారు.  మంత్రి కేటీఆర్ ప్రసంగానికి ఎన్.ఆర్.ఐల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కేటీఆర్ మాట్లాడడం అయిపోగానే సభ్యులంతా లేచి నిలబడి చప్పట్లతో అభినందించారు.

       ఎన్.ఆర్.ఐల సమావేశం తరువాత మంత్రి కేటీఆర్  ఎక్స్ క్లూజివ్ ఇన్వెస్టర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మీటింగ్ లో మాట్లాడిన కేటీఆర్, కరోనా పాండమిక్ ముగిసిన తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అద్భుత అవకాశాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. 2015 లో తెలంగాణ నూతన రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి  బే ప్రాంతానికి వచ్చిన తను, ఇవాళ తెలంగాణ విజయగాథను వివరించడానికి మరోసారి వచ్చానన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనుసరిస్తున్న డెవలప్ మెంట్ మోడల్ ను కేటీఆర్ వివరించారు. అన్ని రంగాల్లో సమానమైన వృద్ధిని ఎలా సాధించవచ్చో చూడాలంటే తెలంగాణకు రావాలన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ తెలంగాణ కూడా ఇవాళ వృద్ధిలో దూసుకుపోతుంద‌ని అన్నారు కేటీఆర్. ఇండియాలో విజయవంతమైన రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు. చివర్లో మాట్లాడిన కాన్సుల్ జనరల్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ , డైనమిజానికి కేటీఆర్ మారు పేరన్నారు. టీ హబ్ లాంటి వినూత్న ఆలోచనలు కేవలం కేటీఆర్ లాంటి నాయకుడికే వస్తాయన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణపై చలిపిడుగు... ఈ నాలుగు జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త
Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..