ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యంగా మారాలా?:సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ దాఖలు

Published : Nov 09, 2023, 01:22 PM ISTUpdated : Nov 09, 2023, 01:54 PM IST
ఒకనాటి కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు సామంత రాజ్యంగా మారాలా?:సిరిసిల్లలో కేటీఆర్ నామినేషన్ దాఖలు

సారాంశం

తెలంగాణ మంత్రి కేటీఆర్  మరోసారి  తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.  సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి కేటీఆర్  బరిలోకి దిగారు.  

సిరిసిల్ల: తెలంగాణ మంత్రి కేటీఆర్ గురువారంనాడు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు.పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి  మంత్రి కేటీఆర్ సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుండి నామినేషన్ దాఖలు చేశారు.  నామినేషన్ దాఖలు చేసిన తర్వాత  సిరిసిల్లలో  కేటీఆర్  మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి  ఢిల్లీలో బాసులుంటారన్నారు. ఢిల్లీ నేతల అనుమతి తీసుకోకుండా  కాంగ్రెస్ నేతలు పనిచేయలేరని చెప్పారు. లేదా కర్ణాటక కాంగ్రెస్ నేతల అనుమతితో తెలంగాణ నేతలు నడుచుకుంటున్నారన్నారు. ఒకనాటి  కాకతీయ సామ్రాజ్యం కర్ణాటకకు  సామంత రాజ్యం కావాలా అని కేటీఆర్ ప్రశ్నించారు. 

కరెంట్ కావాలా? కాంగ్రెస్ కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలను కోరారు.కన్నీళ్లు కావాలా, నీళ్లు కావాలో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టే స్కీమ్ లు కావాలా, కాంగ్రెస్ స్కామ్ లు కావాలో  తేల్చుకోవాలని కేటీఆర్ కోరారు.గత తొమ్మిదిన్నర ఏళ్లుగా  కులం అనే కుంపటి, మతం అనే చిచ్చును కేసీఆర్ పెట్టలేదన్నారు.  అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకే  కేసీఆర్ పెద్దపీట వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సిరిసిల్ల తనకు రాజకీయ భిక్ష పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తొమ్మిదిన్నర ఏళ్లుగా  సిరిసిల్ల ప్రజలకు తాను ఏం చేశామో  ప్రజలకు వివరించామన్నారు.   సిరిసిల్ల ప్రజలు తలెత్తుకొనేలా చేశానని కేటీఆర్ గుర్తు చేశారు. సిరిసిల్లలో ఇప్పటివరకు  తాను ఏం చేశానో ప్రతి ఇంటికి ప్రగతి నివేదికలను పంపనున్నట్టుగా  కేటీఆర్ తెలిపారు.

also read:సిరిసిల్ల నుండి మరోసారి బరిలోకి కేటీఆర్: నామినేషన్ దాఖలుకు ముందు ప్రగతిభవన్ లో పూజలు

సబ్బండ వర్గాలకు  తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. పేదల కోసం  తమ ప్రభుత్వం  అనేక పథకాలను  ప్రవేశ పెట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.  అభివృద్ది, సంక్షేమం కోసం  పాటుపడుతున్న కేసీఆర్ ను గెలిపిద్దామా,  లేక కులం,మతం కోసం  ప్రజల మధ్య ఘర్షణలు పెట్టే ప్రతిపక్షాలను గెలిపిద్దామా  అని ఆయన ప్రజలను ప్రశ్నించారు.

 

తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పాటుపడుతున్న  కేసీఆర్  గొంతు నొక్కేందుకు ఢిల్లీ దండయాత్ర చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ వాడొచ్చి తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.కేసీఆర్ కు అండగా నిలుద్దామా, ఢిల్లీతో అంటకాగి  కేసీఆర్ గొంతు నొక్కుదామా తేల్చుకోవాలని ఆయన  ప్రజలను కోరారు.ఈ విషయాలపై ఆలోచించి నవంబర్ 30న ఓటు వేయాలని కేటీఆర్ కోరారు.  తాత్కాలిక ప్రయోజనాలకు  ఆశపడవద్దని  ఆయన ఓటర్లను కోరారు.ఆంధ్రలో  ఆనాడు విలీనమై అనేక కష్టాలు పడినట్టుగా  కేటీఆర్ గుర్తు చేశారు. మరోసారి అలాంటి తప్పు చేస్తే  తెలంగాణ  మళ్లీ వెనుకబాటుకు గురౌతుందన్నారు. సిరిసిల్ల ప్రజలు ప్రలోభాలకు లొంగిపోరని  కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Venkaiah Naidu: బండ్ల గణేష్ కుమార్తె నిశ్చితార్థం హాజరైన వెంకయ్య నాయుడు| Asianet News Telugu
KA Paul Pressmeet: తెలంగాణని నాశనం చేయడానికి కవిత కొత్త పార్టీ పెట్టింది: కేఏ పాల్| Asianet Telugu