
సిద్దిపేట : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కేంద్రానికి తరలించి శ్రీకాకుళం జిల్లాలో బోరు బావుల వద్ద మీటర్లు పెట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టేందుకు అంగీకరించకపోవడంతో ఎఫ్ఆర్ బిఎం (ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్) కింద రాష్ట్రానికి రూ. 5 వేల కోట్లు కోత వేశారని చెప్పారు. ఏపీకి మొత్తంగా రూ. 7వేల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుందన్నారు. సిద్దిపేటలో చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధులతో ఆదివారం మంత్రి సమావేశం నిర్వహించారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్టంలో సంస్కరణలు తేవాలంటూ రాష్ట్రాల మెడపై కత్తి పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తును వ్యవసాయానికి అందిస్తోంది అన్నారు. అందుకు ఏటా రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. బిజెపి ఎవరికీ ఏమీ ఇవ్వడం లేదని, పైగా ఇచ్చే దాంట్లోనే కోతలు పెడుతోందని అన్నారు. గ్యాస్ రాయితీ తగ్గించి, ఎరువులు, యూరియా ధరలు పెంచింది అన్నారు. బిజెపి సోషల్ మీడియా తప్పుడు ప్రచారాన్ని సమిష్టిగా తిప్పికొట్టాలని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకులు టిఆర్ఎస్పై ఏడుస్తున్నారన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రమూ బాగుపడ్డ దాఖలాలు లేవన్నారు.
శ్రీ రామచంద్ర మిషన్ రాష్ట్రానికి గర్వకారణం..
శ్రీ రామచంద్ర మిషన్ ను స్థానికంగా ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హాలోని శ్రీ రామచంద్ర మిషన్ (కన్హ శాంతి వనం)లో మెడికల్ సెంటర్ ను శ్రీ రామచంద్ర మిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ (దాజీ)తో కలిసి ఆదివారం మంత్రి ప్రారంభించారు. అంతకుముందు దాజీతో కలిసి ధ్యానం చేశారు. మెడికల్ సెంటర్లో 12 పడకలతో ప్రతిరోజు 24 గంటలూ అత్యాధునిక వైద్యసేవలు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.