వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్ట్ రేపటికి వాయిదా వేసింది
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్ట్ రేపటికి వాయిదా వేసింది. ఈరోజు సాయంత్రం విచారణ జరగాల్సి వుండగా.. వాదనలకు ఎంత సమయం కావాలని సీబీఐ, అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను ధర్మాసనం కోరింది. దీంతో తమకు గంటల సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్ట్ విచారణను రేపటికి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
Also Read: వైఎస్ సునీతా రెడ్డి వెనుక దుష్టశక్తులు: వివేకా సోదరి విమలా రెడ్డి
కాగా.. వివేకా కేసులో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి తనను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సర్వోన్నత న్యాయస్థానం దీనిని తోసిపుచ్చింది. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం విషమంగా వుందని, ఆమె ఆరోగ్యం కుదుటపడేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ కోరారు. సుప్రీంకోర్టులో తనకు ఊరట లభించకపోవడంతో అవినాష్ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. దీంతో న్యాయస్థానం రేపు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది.