
జాతీయ కార్యవర్గ సమావేశాలు, పరేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభ తర్వాత తెలంగాణలో బీజేపీలో (bjp) జోష్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్దిరోజుల క్రితం తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) .. సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. దీనికి ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎస్ కార్యాలయ అధికారులకు ఈ దరఖాస్తులు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు బండి సంజయ్ కి సమాచారం అందించారు.
గత నెల 28న 88 అంశాలపై బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు. ప్రగతి భవన్ నిర్మాణం నుంచి మీడియా ప్రకటనల వరకు వివరాలను బండి సంజయ్ ఆర్టీఐ కింద కోరినట్టుగా తెలుస్తోంది. సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్ని రోజులు హాజరయ్యారనే వివరాలను కూడా బండి సంజయ్ కోరారు. 2014 జూన్ 2 నుంచి 2002 జూన్ 2 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఇచ్చిన హామీలు, వాటి అమలుకు సంబంధించిన వివరాలను తెలపాలని కూడా బండి సంజయ్ దరఖాస్తు చేశారు. అలాగే కేసీఆర్.. ఎన్ని రోజులు ప్రగతి భవన్లో ఉన్నారు, ఫామ్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నారనే దానిపై సమాచారం ఇప్పించాల్సిందిగా కోరారు.
భర్తీ చేసిన ఉద్యోగాలు, గ్రామ పంచాయితీలకు కేటాయించిన నిధులు, రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు, కేసీఆర్ జీతభత్యాలు, పర్యటనల వివరాలు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వివరాలు, రైతుల రుణమాఫీ, కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు, సబ్సీడీ రుణాలు.. ఇలా పలు అంశాలపై వివరాలు అందజేయాల్సిందిగా బండి సంజయ్ ఆర్టీఐ కింద దరఖాస్తులు దాఖలు చేశారు.