
KCR Oath: తెలంగాణ మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న తర్వాత ఈ రోజు తెలంగాణ శాసన సభకు వచ్చారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్.. స్పీకర్ చాంబర్లోనే కేసీఆర్తో ప్రమాణం చేయించారు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారి ఆయన తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. కామారెడ్డి నుంచి ఓడిపోయినప్పటికీ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి గెలిచారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన నేరుగా ప్రగతి భవన్ నుంచి ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌజ్కు వెళ్లారు. ఫామ్ హౌజ్లోనే గాయమైంది. తుంటికి బలమైన గాయం కావడంతో యశోద హాస్పిటల్లో ఆయనకు తుంటి ఆపరేషన్ చేశారు.
ఈ ఆపరేషన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేసీఆర్ శాసన సభకు వచ్చారు. ఈ రోజు మంచి రోజు కావడంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలని కేసీఆర్ అనుకున్నారు.
Also Read : Budget2024: మనం ప్రపంచానికి దారి చూపాం.. మిడిల్ ఈస్ట్ కారిడార్ చరిత్రలో నిలుస్తుంది: నిర్మల సీతారామన్
ఎన్నికల తర్వాత కేసీఆర్ తిరిగి మళ్లీ ఇవాళే బయటకు వచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహంలో ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ శాసన సభకు వచ్చారు. ఇదే రోజు కేసీఆర్ను బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేతగా కే చంద్రశేఖర్ కొనసాగుతారని స్పష్టం అవుతున్నది.