ఒక్కసారి కాదు.. వందసార్లయినా కేసీఆర్ కాళ్లు మొక్కుతా : డీహెచ్ శ్రీనివాస్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 20, 2022, 7:15 PM IST
Highlights

తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్లు మొక్కిన వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాదాలు ఒక్కసారి కాదు.. వందసార్లయినా మొక్కుతానని అన్నారు. 

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాదాలు ఒక్కసారి కాదు.. వందసార్లయినా మొక్కుతానని అన్నారు. సీఎం తనకు తండ్రి సమానులని ఆయన పాదాలను తాకడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు శ్రీనివాస్. భద్రాద్రి- కొత్తగూడెం ప్రాంతానికి కేసీఆర్ కొత్త వైద్యశాలను కేటాయించారని ఆయన అన్నారు. తెలంగాణకు కేసీఆర్ మరో బాపూజీ అని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక్కడ కాలేజీలు లేకపోవడం వల్ల 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ చేయడానికి తాను హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా.. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మెడికల్ కాలేజీలను గత మంగళవారం ప్రగతి భవన్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సంగారెడ్డి, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండంలో ఈ ఎనిమిది కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఈ కాలేజీలన్నింటిలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. 

ALso Read:కేసీఆర్ కాళ్లు మొక్కిన డీహెచ్ శ్రీనివాసరావు.. టీఆర్ఎస్ టికెట్ కోసమేనన్న మాజీ ఐఏఎస్..

ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన డీహెచ్ శ్రీనివాసరావు కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చారు. కొన్ని సెకన్ల పాటు కేసీఆర్‌తో మాట్లాడి.. ఆయన కాళ్లకు నమస్కారం చేశారు.  కార్యక్రమం పూర్తైన తర్వాత కేసీఆర్ అక్కడి నుంచి వెళ్తున్న సమయంలో  కూడా ఆయన కాళ్లకు డీహెచ్ శ్రీనివాసరావు నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వచ్చే అసెంబ్లీ  ఎన్నికల్లో టికెట్ కోసమే ఆయన ఇలా చేశారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

click me!