
హైదరాబాద్: తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సమగ్రత, సమీకృతి, సమతుల్య పురోగతిని సాధించిందని వివరించారు. ఎంసీఆర్, హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన అభయ్ త్రిపాఠి స్మారకోపన్యాసం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడిన, పాటుపడుతున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు.
తెలంగాణ ఏర్పడినప్పుడు భద్రత సహా అనేక విషయాల్లో ఎన్నో సంశయాలు ఉండేవని, కానీ, ఇప్పుడు ఇక్కడ అందరూ ప్రశాంత జీవనం సాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగలేదని వివరించారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి తాగునీరు అందించారని చెప్పారు. దాని స్ఫూర్తితోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలనే లక్ష్యం నుంచే మిషన్ భగీరథ ఏర్పడిందని వివరించారు. తెలంగాణలో 30 లక్షలకు పైనే వ్యవసాయ బోర్లు ఉన్నాయని, వీటికి కరెంట్ ఎక్కువపడుతున్నదని పేర్కొన్నారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల కరెంట అందిస్తున్నామని తెలిపారు. ఐటీ రంగంలోనే పురోగతి సాధించామని, తెలంగాణలో ఐటీ ఎగుమతులు 2.41 లక్షల కోట్లకు చేరాయని వివరించారు. ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కల్పనలో బెంగళూరును హైదరాబాద్ దాటేసిందని చెప్పారు.
Also Read: కిషన్ రెడ్డి ప్రమాణం.. మధ్యలోనే వెళ్లిపోయిన విజయశాంతి, కిరణ్ రెడ్డిపై సెటైర్లు
కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని, ఇది ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసిందని కేటీఆర్ వివరించారు. వరి ధాన్యంలో తెలంగాణ దేశంలోనే టాప్లో ఉన్నదని అన్నారు. విభన చట్టంలో పొందపరిచిన ఒక్క హా మీని కూడా కేంద్రం నెరవేర్చలేదని తెలిపారు. తెలంగాణకు నయా పైసా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్రానికి తెలంగాణ ఒక్క రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని వివరించారు. కానీ, ఇక్కడి నేతలు కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని అబద్ధాలు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.