అది బీఆర్ఎస్ కాదు, ‘‘ బందిపోట్ల రాష్ట్ర సమితి ’’.. సభలో ఒక్కరి మొహంలోనైనా నవ్వుందా : బండి సంజయ్

By Siva KodatiFirst Published Dec 9, 2022, 8:45 PM IST
Highlights

బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కుటుంబాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని, కాషాయ జెండా పవర్ ముందు నిలబడలేరని ఆయన వ్యాఖ్యానించారు. 

టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌‌గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించి, మీటింగ్ పెడితే... ఒక్కరి మొహంలోనూ నవ్వు లేదన్నారు. అది ఆవిర్భావ సభలా లేదని, సంతాప సభలా ఉందంటూ ధ్వజమెత్తారు. పార్టీ పేరు నుంచి, జెండా నుంచి తెలంగాణను తీసేశారని , బెంగళూరులో డిపాజిట్ రాని వాళ్ళను తెచ్చుకున్నారంటూ బండి సంజయ్ ఘాలు వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రారంభించినప్పుడు ఏం చేస్తాడో చెప్పాలని... సమైక్యవాది అయిన ఉండవల్లిని తీసుకొచ్చి, దావత్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటూ ఆయన మండిపడ్డారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారని... కేసీఆర్ తెలంగాణ మీద మాట్లాడే అర్హత కోల్పోయాడని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 

అది బీఆర్ఎస్ కాదు... బందిపోట్ల రాష్ట్ర సమితి అని సంజయ్ దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చేశాడని ఆయన ఆరోపించారు. పంజాబ్‌లో రైతులకు కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లని పరిస్థితి నెలకొందని.. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చాడని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం దోచుకుతిన్నదని.. కేసీఆర్ బిడ్డ కవిత ఢిల్లీలో లిక్కర్ దందా చేసింది ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ లిక్కర్ దందా చేస్తుందా అంటూ సంజయ్ సెటైర్లు వేశారు.

ALso REad:ఢిల్లీ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరాలి: పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్

బిడ్డ లిక్కర్ దందా పక్కకు పోయేందుకే... బీఆర్ఎస్ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన ఆరోపించారు. జాతీయ పార్టీ పెడితే... విధివిధానాలు ఉండాలని, కేవలం తన కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. గుజరాత్‌లో బిజెపి గ్రాండ్ విక్టరీ నుంచి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల్లో కేసీఆర్ తెలంగాణకు ద్రోహం చేశారని సంజయ్ దుయ్యబట్టారు. తెలంగాణకు 575 టీఎంసీలు రావాల్సి ఉంటే ... 299 టీఎంసీలకే సంతకం చేసి, తెలంగాణ నోట్లో మట్టికొట్టారని ఆయన ఆరోపించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్లు దండుకున్నాడని.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య కమిషన్‌లపై అండర్ స్టాండింగ్ ఉందని సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల నాయకులు కుట్రలతో సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఇక్కడే ఏమి పీకలేనోడు ... దేశ రాజకీయాల్లో ఏం పీకుతాడు అంటూ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌వి అన్నీ బూటకపు వాగ్దానాలేనన్న ఆయన.. ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చాడని ప్రశ్నించారు. కాషాయ జెండా కాంతిలో రంగు రంగుల జెండాలు మాడి మసైపోతాయని బండి సంజయ్ జోస్యం చెప్పారు. 
 

click me!