తెలంగాణలో కరోనా రోగుల రికవరీ 71 శాతం: మోడీతో కేసీఆర్

By narsimha lodeFirst Published Aug 11, 2020, 2:09 PM IST
Highlights

కరోనా నేపథ్యంలో దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంలో దృష్టి పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా నేర్పిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్: కరోనా నేపథ్యంలో దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంలో దృష్టి పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. కరోనా నేర్పిన అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మంగళవారం నాడు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను ప్రస్తావించారు.  కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసిందని సిఎం అన్నారు.

. వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలన్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలని ఆయన సూచించారు.

గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. దీన్ని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

 జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? వంటి విషయాలను ఆలోచించాలి. ఐఎంఎ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు.  కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాలు రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని ఆయన తెలిపారు.

కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు,సామాగ్రి సిద్ధంగా ఉంచాం. ఐసిఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నట్టుగా ఆయన గుర్తు చేశారు.. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తుందని సీఎం వివరించారు.

ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వైద్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్య శాఖ విభాగాధిపతులు శ్రీనివాస రావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

click me!